రాష్ట్రం అంధకారప్రదేశ్‌గా మారడానికి జగన్మోహన్‌రెడ్డి స్వార్థమే కారణమని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో గత 45రోజుల్నుంచీ పూర్తిస్థాయిలో జలవిద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నాకూడా రాష్ట్రంలో కరెంట్‌ కోతలు ఎందుకు విధిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలుగుదేశంపార్టీ రాష్ట్రఅధ్యక్షులు, మాజీమంత్రి కళావెంకట్రావు   డిమాండ్‌ చేశారు. అధికారం చేపట్టి 5నెలలు కావస్తున్నా, పాలనపై, ప్రభుత్వ యంత్రాంగ ంపై పట్టు సాధించలేని స్థితిలో ఉన్న ముఖ్యమంత్రి, ప్రజలపై కోపంతో విద్యుత్‌కోతలు విధిస్తున్నారా...లేక సమీక్షలపేరుతో దండుకోవడానికి కృత్రిమకొరత సృష్టిస్తున్నారా అని కళా ప్రశ్నించారు. 

పీపీఏలపై సమీక్షలుచేసిన జగన్‌, కమీషన్లపై శ్రద్ధపెట్టారుగానీ, ప్రజల సమస్యలపై శ్రద్ధచూపలేకపోయారన్నారు. ప్రజల్ని బాధపెడుతూ, వారికందించాల్సి న కరెంట్‌ ఆపేసి, గతప్రభుత్వంపై బురదజల్లడానికి ఉత్సాహం చూపుతున్న జగన్‌, కరెంట్‌ కోతలపై ప్రజలకు ఏం సమాధానం చెబుతాడని కళా నిలదీశారు. 2014కి ముందు రాష్ట్రంలో 22.5మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌లోటు ఉంటే, టీడీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని అధిగమించి 24గంటలు నిరంతరంగా విద్యుత్‌సరఫరా అందించామన్నారు   టీడీపీ ప్రభుత్వ పనితీరు జగన్‌ ఒప్పుకోకపోయినా, రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ హాయాంలో కరెంట్‌కోతలు లేవనే  నిజాన్ని తెలుసుకున్నారన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక కరెంట్‌ ఎప్పుడు పోతుందో.. వస్తుందో ఎవరికీ తెలియడం లేదన్నారు. 20వేల కోట్ల కరెంట్‌ బకాయిలు తీర్చామని చెబుతున్న జగన్‌ప్రభుత్వం, విద్యుత్‌ కంపెనీల విధివిధానాలు, వాటితో ప్రభుత్వం జరిపే విద్యుత్‌ క్రయవిక్రయాల వ్యవహారం ఎలా ఉంటుందో విద్యుదుత్పత్తి తయారుచేసే కంపెనీ ఉన్న వ్యక్తిగా జగన్‌కు తెలియదా అని  మాజీమంత్రి ప్రశ్నించారు. 


కర్ణాటకలో పవర్‌ప్లాంట్‌ ఉన్న జగన్‌, అక్కడ యూనిట్‌విద్యుత్‌ని రూ.4-87పైసలకు అమ్ముకుంటున్నాడని, అలాంటి వ్యక్తి ఇప్పుడు రూ.11-68పైసలకు థర్మల్‌విద్యుత్‌ ప్లాంట్లనుంచి విద్యుత్‌ కొంటున్నప్పటికీ రాష్ట్రంలో కరెంట్‌కోతలు ఎందుకు విధిస్తున్నారని కళా నిలదీశారు. అలాకొనే విద్యుత్‌ను ప్రజలకు అందించడంలో వైసీపీ సర్కారు ఎందుకు విఫలమైందన్నారు. రూ.3 నుంచి రూ.4-84పైసల వరకు సౌర, పవన విద్యుత్‌ లభిస్తుంటే, రూ.11-68పైసలుపెట్టి కర్ణాటక నుంచి థర్మల్‌ విద్యుత్‌ను  కొనడంలోని అసలు మర్మమేమిటో జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. 


ముఖ్యమంత్రి చేసిన సమీక్షలు, ఆయనకు కమీషన్లు తీసుకొచ్చేందుకే ఉపయోగపడ్డాయన్న కళా, తన చేతగానితనాన్ని గతప్రభుత్వ వైఫల్యంగా చెప్పడం జగన్‌కు వ్యసనంగా మారింద న్నారు. ప్రభుత్వాన్ని, అభివృద్ధిని పట్టించుకోకుండా, ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసిన జగన్‌ సర్కారుకు తెలుగుదేశంపై విమర్శలు చేసే హక్కులేదన్నారు. వైఎస్‌ హయాంలో ఉన్న రూ.10వేలకోట్లను తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించిందన్న కళా, ప్రభుత్వాలు మారినప్పుడు, గత ప్రభుత్వాల హాయాంలో ఉండే పెండింగ్‌బకాయిలను, కొత్తగా వచ్చిన ప్రభుత్వం క్లియర్‌ చేయడమనేది చాలా సహజంగా జరుగుతుంటుందన్నారు. 


విద్యుత్‌ ఉద్యోగుల విషయంలో కేసీఆర్‌తో చర్చించిన జగన్‌, వారికి న్యాయం చేయడంలో విఫలమయ్యాడన్నారు. కేసీఆర్‌తో జగన్‌ ఏంచర్చించారో, ఏఏ అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయో ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. సింగరేణి నుంచి బొగ్గు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం టన్ను రూ.1600లకు లభిస్తుంటే,  రూ.3,000 వరకు ఎందుకు చెల్లిస్తున్నారన్నారు. అంతఎక్కువ ధరకు బొగ్గును కొని, రెట్టింపుధరకు థర్మల్‌ విద్యుత్‌కొని, రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ ఎందుకు ఇవ్వలేకపోతున్నారో  జగన్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. పీపీఏలపై కోర్టులు కర్రుకాల్చి వాతపెట్టినా వినకుండా, సమీక్షలు చేసిన జగన్‌ ప్రభుత్వం ఏం సాధించిందని కళా నిలదీశారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: