ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్. అయన చమత్కారంగా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు గ్రామ వాలంటీర్ల పరిస్థితి తయారైందని పోల్చారు. రివర్స్ టెండరింగ్‌లో సీఎం జగన్ వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని నారా లోకేష్ ప్రస్తావించారు. గ్రామ వాలంటీర్లు కూడా జగన్‌ని ఆదర్శంగా తీసుకుని గ్రామాల్లో దోపిడీ మొదలెట్టేశారని ఘాటు విమర్శలు చేశారు.

అయితే 2 నెలలు కాకముందే పింఛనుదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని, దసరా మామూళ్ల పేరుతో దోపిడీ చేస్తున్నారని లోకేష్ అన్నారు. అధికారంలోకి వస్తానే పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీని వైఎస్ జగన్ తుంగలో తొక్కారని లోకేష్ విమర్శించారు. పింఛను మూడు వేలకు పెంచుతామని చెప్పి కేవలం రూ.250 మాత్రమే పెంచారని ఈ ముఖంగా అయన తెలిపారు. అందులో కూడా రూ.250 మామూళ్ల కింద కట్టాల్సి వస్తోందని ఆరోపించారు.

ఇక కొత్త పింఛను కావాలంటే కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని లోకేష్ తెలియ చేసారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల కోసం సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలకు చంద్రన్న కానుకలు పంపిణీ చేసే వారన్నారు. జగన్ ప్రభుత్వంలో పండుగలకు ప్రజలే శిస్తు కట్టాల్సిన పరిస్థితి దాపురించిందని లోకేష్ చాలా ఘాటుగా విమర్శించారు.

అయితే పెన్షన్‌దారుల నుంచి దసరా మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో నలుగురు గ్రామ వాలంటీర్లపై ప్రభుత్వం వేటు వేసిన సంగతి తెలిసిందే. పింఛనుదారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు విచారణ జరిపాలని స్థానిక అధికారులను ఆదేశించారు. గ్రామ వాలంటీర్లపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో వెంటనే వారిని విధుల నుంచి తొలగించారు. రెండు నెలలు కూడా తిరగక గ్రామ వాలంటీర్లు వసూళ్లకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: