తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఈ డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆర్టీసీని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని తెగించి చెప్పింది. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేసింది.
దీంతో కెసిఆర్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులను తీసేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కార్మిక సంఘాలు కెసిఆర్ పై మండిపడుతున్నాయి. ఏకపక్ష నిర్ణయాలు పనికిరావని అంటున్నాయి. పైగా దీనిపై అఖిలపక్ష సమావేశం కూడా ఉండదని చెప్పడం విశేషం. దీంతో కెసిఆర్ ఇరకాటంలో పడ్డారని తెలుస్తోంది.
కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్టీసీ కార్మిక సంఘాలతో పాటు అటు రెవిన్యూ ఉద్యోగ సంఘాలు కూడా గుర్రుగా ఉన్నాయి. గతంలో రెవిన్యూ డిపార్ట్మెంట్ పై కెసిఆర్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇది ఆ ఉద్యోగులకు నచ్చలేదు. కానీ, అవకాశం కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకు పిలుపును ఇవ్వడంతో దానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఒక్క రెవిన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని టీచర్స్, ఇతర సంఘాలు కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
మాములుగా మద్దతు ఇచ్చి ఊరుకోవడం కాకుండా... అవసరమైతే పెన్ డౌన్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉండేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. కెసిఆర్ ప్రభుత్వానికి ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకంగా ఉన్నది. ఉద్యోగులు పెన్ డౌన్ చేయడంతో కేంద్రం దిగివచ్చి తెలంగాణను ప్రకటించింది. ఇప్పడు అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మరి కెసిఆర్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.