ఆర్టీసీని మూడు రకాలుగా విభజించి నడపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు . ప్రస్తుతం ఆర్టీసీ దగ్గర 10,400 బస్సులున్నాయన్న అయన , వీటిని భవిష్యత్ లో మూడు రకాలుగా విభజించి నడపనున్నట్లు తెలిపారు . 50% బస్సులు అంటే 5200 పూర్తిగా ఆర్టీసీకి చెందినవేనని , ఆర్టీసీ యాజమాన్యంలోనే వుంటాయని చెప్పారు . ఇక 30% బస్సులు, అంటే 3100 బస్సులు అద్దె రూపేణా తీసుకుని వాటిని కూడా పూర్తిగా ఆర్టీసీ పర్యవేక్షణలోనే, ఆర్టీసీ పాలన కిందే నడపడం జరుగుతుందని చెప్పారు. మరో 20% బస్సులు అంటే 2100 బస్సులు పూర్తిగా ప్రయివేటువని, ప్రయివేట్ స్టేజ్ కారేజ్ గా వీటికి అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు .
ఈ బస్సులు పల్లెవెలుగు సర్వీసు కూడా నడపాలని, అద్దెకు తీసుకున్న బస్సులు, స్టేజ్ కారేజ్ బస్సులు ఇతర రూట్లతో పాటు నగరంలొ కూడా నడపాల్సి ఉంటుందని చెప్పారు. ఆర్టీసీ చార్జీలు, ప్రయివేట్ బస్సుల చార్జీలు సమానంగా, ఆర్టీసీ నియంత్రణలోనే వుంటాయని తెలిపారు . వాళ్ల చార్జీలు కూడా ఆర్టీసీ పెంచినప్పుడే పెంచడం జరగాలని , స్వల్పంగా పెంచడానికి కూడా ఆర్టీసీ కమిటీ నిర్ణయం మేరకు అవసరం అని భావించినప్పుడు చేయాలన్నారు. ఇప్పటికీ 21% అద్దెబస్సులను ఆర్టీసీ నడుపుతున్నదని , అంటే, మరో 9% బస్సులను మాత్రమే అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు .
అదనంగా 9% అద్దె బస్సులను పెంచడం అంటే ఆర్టీసీకి కొత్త బస్సులు వచ్చినట్లేనని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా ప్రకటన పై విపక్షాలు భిన్నంగా స్పందింస్తున్నాయి . ఆర్టీసీ ని ప్రయివేట్ పరం చేసేందుకే ముఖ్యమంత్రి ఈ ఎత్తుగడ వేశారని విమర్శిస్తున్నారు . ఆర్టీసీ లో ఇప్పటికే ఉన్న తన బినామీల బస్సుల సంఖ్యను పెంచేందుకే కొత్త ఎత్తుగడ వేస్తున్నారని , ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని చెబుతున్నారు .