2014 నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న విషయాలను ఒకసారి భేరీజు చేసుకొంటే.. రెండు ప్రభుత్వాల కాలంలో ఇంచుమించుగా కొన్ని విషయాలు ఒకే విధంగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా గోదావరిలోని దేవీపట్నం ప్రాంతంలో బోటు మునిగిపోయింది. ఆలా బోటు మునిగిపోయిన సమయంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రతిపక్షంలో ఉన్నది.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బోటు మునిగిపోయి ప్రయాణికులు మరణించారని, తక్షణమే ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలను ఆదుకోవాలని
జగన్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షం మొత్తం అధికారపక్షంపై విరుచుకుపడింది. దాదాపుగా చాలారోజులపాటు చంద్రబాబును నిలదీశారు. అదే విధంగా గోదావరి జిల్లాకు చెందిన చింతమనేని ఎమ్మార్వో వనజాక్షి మీద దాడి చేసినపుడు... దానిని ఖండించకపోగా, చింతమనేనిని వెనకేసుకొని వచ్చాడు చంద్రబాబు.
అది బాబును విమర్శలపాలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిపై దాడిచేసిన ఎమ్మెల్యేని ఎలా వెనకేసుకొని వస్తారని
జగన్ నిలదీశారు. వైకాపా ఇదే అంశంపై చాలా రోజులు ప్రభుత్వాన్ని కడిగిపారేసింది. ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి రిప్లై ఇవ్వలేకపోయింది. ఇదిలా ఉంటె 2019లో
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇలానే జరిగింది.
గోదావరిలోని కచ్చులూరు వద్ద బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో చాలామంది మరణించారు. బోటు మునిగిపోయి 20 రోజులు దాటినా ఇంకా దాన్ని బయటకు తీయలేదు. లోపలే ఉండిపోయింది. ఎప్పుడు బయటకు తీస్తారో తెలియడంలేదు. దీనిపై ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోంది. అది మాములే కదా. కచ్చులూరు బోటు మునిగి 20 రోజులు దాటిపోయినా.. ప్రభుత్వం దాని విషయంలో సైలెంట్ గా ఉంటోందని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటె, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మహిళా ఎంపీడీఓ ని బెదిరించారని ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను బెయిల్ పై విడుదల చేశారు. అయితే, జగన్ కొన్ని విషయాల్లో చాలా సీరియస్ గా ఉంటున్నారు. ఎవరు తప్పు చేసినా కఠిన శిక్షలు తప్పవని అంటున్నాడు.