తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జూపూడి
ప్రభాకర్ రావు ను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో వైకాపా అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు . దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన జూపూడి
ప్రభాకర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా వ్యవహరించారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోను ఆయన కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత జూపూడి ప్లేట్ ఫిరాయించారు.
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వెంటనే జూపూడి కి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు . అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదు . దాంతో ఆయన్ని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ చంద్రబాబు సర్కార్ఉత్తర్వులు జారీ చేసింది . అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా దెబ్బ తిని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసింది . వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు టీవీ చర్చల్లోనూ, మీడియా లో, పత్రికా ప్రకటనల ద్వారా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పై అప్పటి వరకూ తీవ్రంగా విరుచుకు పడిన జూపూడి, ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ జూపూడికి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . జగన్
మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన జూపూడి ప్రస్తుతం పశ్చాత్తాప పడుతున్నారు. తాము తప్పిపోయిన గొర్రెల మంటూ తమ తప్పుకు తామే సరిదిద్దుకోవాలని హితోపదేశాలు పలుకుతున్నారు. అయితే జూపూడి ప్రజా నాయకుడు ఏమీ కాదని ... ఆయన్ని ఇప్పుడు వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.