2014 కు ముందు తెరాస పార్టీ అంటే ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన గుర్తింపు ఉన్నది. ఆ పార్టీ ఉద్యమ పార్టీగా పేరు తెచ్చుకుంది. తెలంగాణ సాధన కోసమే పుట్టింది. తెలంగాణ సాధన క్రమంలో పోరాటం చేసింది. నాయకులను, ఉద్యోగసంఘాలను కలుపుకొని పనిచేసింది. ఇలా అందరిని కలుపుకొని పోవడం వలన తెలంగాణ సాధన జరిగింది. ఫలితంగా తెలంగాణ సాధించుకుంది. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెరాస పార్టీ ఘనవిజయం సాధించింది. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.
మొదటి ఐదు సంవత్సరాలు సెంటిమెంట్ తో జరిగిపోయింది. తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో మంచి విజయం సాధించారు. తెరాస పార్టీ విజయానికి కాంగ్రెస్ నాయకత్వ లోపం, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం, బాబుపై ఉన్న వ్యతిరేకత బాగా కలిసి వచ్చింది. మహాకూటమికి ఓటమి పాలైంది. తెరాస పార్టీ విజయం సాధించింది. రెండోసారి కూడా అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన నేతలు తెరాస పార్టీలో చేరిపోయారు.
అయితే, ఇప్పుడు తెరాస పార్టీని ఆర్టీసీ కలవరపెడుతుంది. టెన్షన్ పడేలా చేస్తున్నది. తెలంగాణ పోరాటంలో ముందు తెరాస పార్టీ ఉన్నా.. దాని వెనుక లక్షలాది మంది ఉద్యోగులు కార్మికులు ఉన్నారు. తెలంగాణా వస్తే తమ జీవితాలు బాగుపడతాయని ఊహించారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కెసిఆర్ అప్పట్లో చెప్పారని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. తాను ఆలా చెప్పలేదని కెసిఆర్ అంటున్నారు.
అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు గత ఆరు రోజులుగా స్ట్రైక్ చేస్తున్నారు. బస్సులు నడవడం లేదు.. ప్రయాణికులు ఇక్కట్లు మాములుగా లేవు. ఆఫీస్ లకు వెళ్ళాలి అంటే బస్సుల్లేవు. ప్రైవేట్ బస్సులు చార్జీలు మోత మోగిస్తున్నాయి. చార్జీలు పెంచొద్దు అంటే ఊరుకుంటారా చెప్పండి. దొరికింది కదా ఛాన్స్ అని దోచుకుంటున్నారు.
దసరా సెలవులకు ఊర్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగరానికి ఎలా రావాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. వెళ్లే సమయంలో వెళ్ళాలి కాబట్టి ఎలాగోలా వెళ్లారు. ఇప్పుడు రావడమే ఇబ్బందిగా మారింది. ఇటు ప్రభుత్వం మాత్రం ఆర్టీసీలో విలీనం చేసేది లేదని అంటోంది. అటు ఆర్టీసీ కార్మికులు కూడా మొండిపట్టుదలతో ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.