తెరాస పార్టీకి హుజూర్ నగర్ ఉపఎన్నిక కీలకంగా మారింది. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఉత్తమ్
కుమార్ రెడ్డి విజయం సాధించారు. అయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో హుజార్ నగర్ నియోజక వర్గానికి ఉపఎన్నిక అవసరం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్
కుమార్ రెడ్డి భార్య పోటీలో ఉన్నది.
తెరాస పార్టీ కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దించింది.
దసరా ముందు వరకు అంతాబాగానే ఉన్నది.
దసరా ముందు నుంచి ఆర్టీసీ సమ్మె చేస్తున్నది. సమ్మెకు గల కారణాలు ఎంతు ఏంటో అందరికి తెలుసు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. మొత్తం 26 డిమాండ్లతో కూడిన నోటీసులను ప్రభుత్వానికి ఇచ్చింది ఆర్టీసీ జేఏసీ. కానీ, దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు కెసిఆర్ ప్రభుత్వం. నెలరోజులకు పైగా వేచి చూశారు. కానీ, పట్టించుకోలేదు.
ఆర్టీసీకి ఆదాయాం తీసుకొచ్చే పండుగ సమయంలో బస్సులు నడపకూడదని నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ కార్మికులు. ఇంకేముంది.. సమ్మె మొదలైంది. ఈ సమ్మె ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చేలా ఉన్నది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సమ్మెలు జరగలేదు. బంద్ లు చేయలేదు. కానీ, ఇప్పుడు ఆర్టీసీ సమ్మెతో ఆ పర్వం తిరిగి మొదలౌబోతున్నది. అధికారం చేతిలోకి వచ్చాక కెసిఆర్ కూడా అందరిలానే ఆలోచిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు.
ఇప్పుడు ఉపఎన్నిక జరుగుతుండటంతో ఆ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలి అన్నది తెరాస పట్టుదల. తెరాస క్యాడర్ మొత్తం అక్కడే ఉన్నది. మొన్నటి వరకు అన్ని అనుకూలంగా ఉన్నట్టుగానే ఉన్నా ఇప్పుడు పరిస్థితులు రివర్స్ అవుతుండటంతో తెరాస పార్టీ ఇబ్బందులు పడేలా ఉన్నది. ఒకవేళ ఈ ఉపఎన్నికలో తెరాస పార్టీ ఓటమిపాలైతే.. అది నిజంగా అవమానమే అని చెప్పాలి. తెరాస పార్టీ క్రమంగా తన ప్రభను కోల్పోతుందని చెప్పాలి. ఎవరు గెలుస్తారు అన్నది తెలియాలంటే ఈనెల 24 వ తేదీ వరకు ఆగాల్సిందే.