కొంతమంది పురుషులు మృగాల కంటే దారుణంగా తయారవుతున్నారు. అమాయకులైన ఆడపిల్లల జీవితాలను మాయ మాటలు చెప్పి నాశనం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలో ఆటో డ్రైవర్ చేసిన మోసంతో 14 సంవత్సరాల బాలిక గర్భవతి అయింది. నిన్న బోధన్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాలిక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. బోధన్ ప్రాంతంలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న ఫయాజ్ అనే వ్యక్తి మొదట బాలికతో పరిచయం పెంచుకున్నాడు. 
 
కొన్ని రోజుల పరిచయం తరువాత ఫయాజ్ బాలికను లైంగికంగా లొంగదీసుకుని వాడుకున్నాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. బుధవారం రోజు రాత్రి బాలికకు పురిటినొప్పులు వచ్చాయి. తల్లిదండ్రులు వెంటనే బాలికను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొనివెళ్లారు. నార్మల్ డెలివరీతో బాధిత బాలిక ఆడబిడ్డకు జన్మినిచ్చింది. ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని భావించిన బాలిక తల్లిదండ్రులు ఆడ శిశువును అమ్మేందుకు ప్రయత్నం చేశారు. 
 
ఈ సమాచారం తెలిసిన కొందరు అధికారులకు శిశువును విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందించారు. విషయం అధికారుల దృష్టికి రావటంతో ఆదర్శ మహిళా మండలి అధ్యక్ష్రురాలు పద్మా సింగ్, ఐసీడీఎస్ సీడీసీవో లలిత కుమారి బోధన్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. శిశువును ఎందుకు అమ్మకానికి పెట్టారని పద్మా సింగ్, లలిత కుమారి ప్రశ్నించటంతో బాలిక తల్లిదండ్రులు తమ పరువు పోతుందని భావించి శిశువును అమ్మకానికి పెట్టామని తెలిపారు. 
 
లలిత కుమారి, పద్మా సింగ్ శిశువును తీసుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఆటో డ్రైవర్ ఫయాజ్ పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫయాజ్ కోసం గాలింపు చర్యలను మొదలుపెట్టారు. విషయం తెలిసిన స్థానికులు ఆటో డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: