నేటికీ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ఆరొవ రోజుకు చేరుకుంది. సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులు తమంతట తామే ఉద్యోగాలను కోల్పోయారని సీఎం కేసీఆర్ తెలియచేసారు. వీరిని ఎటువంటి పరిస్థితుల్లోనూ విధుల్లోకి తిరిగి తీసుకునేది లేదు అని తేల్చి చెప్పారు. ఆర్టీసీ జేఏసీతో చర్చల జరిగే ప్రసక్తే కూడా లేదు అన్నారు. కానీ ఆర్టీసీ సంఘాలు మాత్రం సమ్మెను తీవ్రతరంలో చేస్తున్నాయి. నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
కోదండరామ్ పరివేక్షణలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో అఖిలపక్షం నేతలు కేసీఆర్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులేమీ కొత్త కోరికలు కోరడం లేదని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆర్టీసీ ప్రైవేట్ ఆపరేటర్లు, సీఎం మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆయన ఆరోపణ చేశారు.
అవసరమైతే తెలంగాణ బంద్కు కూడా సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలుపుతున్నారు. అఖిల పక్ష భేటీలో పాల్గొన్న సీపీఐ వర్గాలు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతునిచ్చింది. హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తోన్న సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి.. గులాబీ బాస్తో తామేమీ ఒప్పందం చేసుకోలేదు.. అవసరమైతే మద్దతును ఉప సంహరించు కుంటాము అని తెలిపారు. ఆర్టీసీ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని
కేసీఆర్ తమతో తెలిపారు అని అన్నారు.
ఒక్క వైఎస్ఆర్సీపీ మినహాయిస్తే.. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మిగతా అన్ని పక్షాలన్నీ గులాబీ బాస్ తీరు పట్ల బాగా మండిపడుతున్నాయి. సమ్మె విషయంలో
కేసీఆర్ వ్యవహరిస్తోన్న తీరు ఆయనకే నష్టం తీసుకొని వస్తుంది అని అఖిలపక్ష నేతలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మొత్తానికి ఆర్టీసీ సమ్మె వ్యవహారం హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు చేటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో! మరి ఏమి అవుతుందో చూడాలి....