తెలంగాణాలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  ఓ వైపు బస్సులు లేకపోవడం... మరోవైపు తాత్కాలిక సిబ్బందితో నడుపుతున్న బస్సులు ఎటూ సరిపోకపోవడం ప్రయాణీకులకు ఇబ్బందిగా మారింది. ఇది చాలదన్నట్టుగా తాత్కాలిక డ్రైవర్లు పలు చోట్ల యాక్సిడెంట్లకు పాల్పడుతుంటే... తాత్కాలిక కండక్టర్లు తమ ఇష్టమొచ్చినట్టుగా ప్రయాణీకుల నుంచి ఛార్జీల రూపంలో డబ్బులను దండుకుంటున్నారు. 


ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం... ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.   గురువారం(అక్టోబర్ 10,2019) జిల్లా ఎస్పీ రంగనాథ్ నార్కట్ పల్లి బస్టాండ్ లో బస్సుల రాకపోకలను పరిశీలించారు.  బస్సుల్లోకి వెళ్లి ఎంత ఛార్జీ తీసుకుంటున్నారని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అసలు ధర కంటే ఎక్కువగా వసూలు చేశారని ప్రయాణికులు చెప్పడంతో ఆయన సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనేనల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో టికెట్ రేటు కన్నా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఇద్దరు కండక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.   
యాదగిరిగుట్ట డిపోకు చెందిన రామాంజనేయులు అనే తాత్కాలిక కండక్టర్‌ను విధుల నుంచి తొలగించింది.   అతడిపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించిన ఎస్పీ ఏవి రంగనాథ్ పోలీసులను ఆదేశించారు. మరోవైపు ఖమ్మం డిపోకు చెందిన కండక్టర్ నాగేశ్వరరావుపై కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చీటింగ్ కేసు నమోదు చేశారు.భువనగిరి నుంచి నల్గొండ వెళ్లే బస్సులో అసలు టికెట్ ధర రూ.65. కాగా ఒక్కో ప్రయాణికుడి దగ్గర రూ.75 వసూలు చేశారు.

ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులోనూ అధిక ఛార్జీలు వసూలు చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రభుత్వం పోలీసులను సాయంతో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: