సంపాదన కోసం వ్యాపారులు తినే తిండిని కల్తీ చేస్తున్న ఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంపాదన కోసం కొంతమంది వ్యాపారులు వినియోగదారుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటివరకు పాలలో కల్తీ అంటే నీళ్లు పోసి కల్తీ చేయటం, పౌడర్ తో కల్తీ చేయటం మాత్రమే విన్నాం. కానీ తాగే పాలలో ప్లాస్టిక్ కలుపుతూ కొందరు వ్యాపారులు వినియోగదారుల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నారు.
హైదరాబాద్ నగరంలో రోజూ టీ తాగే వారికి ఈ న్యూస్ షాక్ కు గురి చేస్తుందని చెప్పవచ్చు. గతంలో బియ్యం, గుడ్లను ప్లాస్టిక్ తో కల్తీ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు తాగే పాలను కూడా కల్తీ చేస్తూ ఉండటంతో హైదరాబాద్ నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో ప్లాస్టిక్ పాలను అమ్ముతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
కూకట్ పల్లిలోని
ప్రగతి నగర్ లో సౌమ్య,
పవన్ అనే ఇద్దరు దంపతులు నివాసం ఉండేవారు. ఈరోజు ఉదయం ఒక లీటర్ పాలను స్థానిక మిల్క్ బూత్ నుండి వీరు కొనుగోలు చేశారు.
సౌమ్య ఆ పాలను వేడి చేయగా పాలు ముద్దగా మారటం గమనించింది. పాలు ముద్దగా మారటం ఏమిటి అని అనుమానం వచ్చిన
సౌమ్య ఆ పాలముద్దను పట్టుకొని పరిశీలించగా ఆ పాల ముద్ద ప్లాస్టిక్ మాదిరిగా సాగటం గమనించింది.
పాలల్లో కల్తీ జరిగిందని నిర్ధారణ కావటంతో దంపతులు మిల్క్ బూత్ వ్యాపారిని పాలల్లో జరిగిన కల్తీ గురించి ప్రశ్నించారు. ఆ మిల్క్ బూత్ వ్యాపారి నిర్లక్ష్యంగా మాకు వచ్చిన పాల ప్యాకెట్లను మేము అమ్ముతున్నామని సమాధానం ఇచ్చాడు. పాలల్లో కల్తీ జరిగిందని మాకు మాత్రం ఏం తెలుస్తుందని మిల్క్ బూత్ వ్యాపారి చెప్పాడు.
పవన్ పాలల్లో జరిగిన కల్తీ గురించి బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారని తెలుస్తోంది.