‘చంద్రబాబూ.. మీరు అందంగా ఉంటాననుకుంటున్నారా లేక శోభన్‌ బాబులా ఫీలవుతున్నారా..! మిమ్మల్ని కలవడానికి జనం ఎందుకు క్యూలు కడతారు అంటూ అనకాకపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ టీడీపీ అధినేతపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనం తనను కలవడానికి క్యూలు కడుతున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన పైవిధంగా స్పందించారు. సీఎంగా జగన్ పాలన గురించి పిచ్చోడి చేతిలో రాయి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుందో గత ఐదేళ్ల బాబు పాలనలో ప్రజలు చూశారని దుయ్యబట్టారు. వైఎస్ తనను చూసి భయపడ్డారంటూ బాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

 


చంద్రబాబుకు మతి పోయిందో.. మత్తెక్కి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబుకు మందు అలవాటు లేదని తెలుసని.. కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏమైనా అలవాటు చేసుకున్నారేమో అనుమానంగా ఉందని అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్న తర్వాత సొంతంగా ఎన్నికలకు వెళ్లారా అని ప్రశ్నించారు. ఒంటరిగా వెళ్తే మీ స్థాయి ఏంటో మొన్నటి ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు బెంగలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. విశాఖ గురించి కలలు కన్నానంటున్న చంద్రబాబు కపట ప్రేమను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను చంద్రబాబే దెబ్బ తీశారని ఆరోపించారు. విశాఖలో భూకుంబకోణం మీ హయాంలో జరిగిందే కదా అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి విశాఖను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. వైఎస్‌ హయాంలో జరిగిన విశాఖ అభివృద్ధి మళ్లీ జగన్‌ హయాంలో మాత్రమే అభివృద్ధి జరగబోతుందని అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు.

 


టీడీపీ నేతల అక్రమ నిర్మాణాలను తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఎమ్మార్వో వనజాక్షిని, చింతమనేని జుట్టుపట్టుకుని కొడితే.. చంద్రబాబే స్వయంగా సెటిల్‌ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాలుగు నెలల పాలనలోనే జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి దేశంలో గొప్ప ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలు కూడా జగన్‌ను ఆదర్శంగా తీసుకోవడం గమనార్హమన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: