హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గెలుపుపై అధికార టీఆర్ఎస్ పార్టీ ఆశలు వదులుకుందా..? నిన్నటి వరకు అక్కడ గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్న టీఆర్ఎస్లో నేడు ఆ ధీమా ఎందుకు సన్నగిల్లింది ? ప్రస్తుతం తెలంగాణలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలే ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయా ? అంటే అవుననే చర్చలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయ పరిణామాలు నెల రోజుల్లో చాలా వరకు శరవేగంగా మారుతున్నాయి.
హుజూర్నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడమే ఆలస్యం తాము గెలిచిపోతామన్న ధీమా నిన్నటి వరకు టీఆర్ఎస్లో ఉండేది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తమ పార్టీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ప్రకటించింది. వెంటనే ఆ పార్టీకి సీపీఐ కూడా సపోర్ట్ చేసింది. ఇక అప్పటి నుంచి పరిస్తితి పూర్తిగా రివర్స్ అయ్యింది. మరోవైపు బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉండడం.. ఇటు ఆర్టసీ సమ్మె ఉధృతం అవ్వడంతో గులాబీ శ్రేణులకు అదిరిపోయే షాక్ తగిలినట్లయ్యింది.
దీంతో మొదట్లో ఉన్న ఉత్సాహంతో పోల్చి చూస్తే ఇప్పుడు ఆ పార్టీ ఉత్సాహం నీరుకారిపోయింది. చివరకు ఆ పార్టీ అగ్రశ్రేణి నేతలు ఇక్కడ రోడ్ షోలు కూడా క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి వచ్చింది. చివరకు 80 మంది ఇన్చార్జ్లను పెట్టుకున్న కేసీఆర్కు సైతం ఇప్పుడు ఇక్కడ పరిస్థితి మరీ అంత అనుకూలంగా లేదన్న నివేదికలు వెళ్లడంతో ఆయన సైతం స్థానిక నేతలతో పాటు ఉప ఎన్నిక బాధ్యులపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈనెల 19న ప్రచారం ముగుస్తుంది. సమయం కూడా లేకపోవడం.. పార్టీ అగ్రనేతలు నియోజకవర్గానికి రాకపోవడంతో.. గెలుపుపై పార్టీ శ్రేణులు ఆశలు వదులుకున్నాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఆర్టీసీ సమ్మెతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, దిగువ, మధ్య తరగతి వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు రావడంతో పాటు వ్యతిరేకత ఎక్కువైంది. మరి ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని అక్కడ గులాబీ జెండా ఎగిరేందుకు కేసీఆర్ ఏం చేస్తారో ? చూడాలి.