అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం గ్రానైట్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. టెక్కలి పరిసర ప్రాంతాల్లో లభించే నీలి గ్రానైట్కు దేశ విదేశాల్లో ఎంతో గిరాకీ ఉంది. నందిగాం మండలం సొంటినూరు ప్రాంతం సర్వే నంబరు 1లో అతి విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటి ఖరీదైన గ్రానైట్ను ఎలాగైనా దక్కించుకోవాలనే ఎత్తుగడలతో దిల్లీ, ముంబయ్కు చెందిన బడా కార్పొరేట్ సంస్థలు కొన్ని రహస్య సర్వేలకు మరోసారి సిద్ధమవుతున్నారు.
గతంలో టీడీపీ హయాంలో టీడీపీ రాష్ట్ర స్థాయి అగ్ర నాయకుడి సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఈ రహస్య సర్వేలకు సహకరించినట్లు సమాచారం. అప్పట్లో ‘సాక్షి’లో వచ్చిన కథనంతో రహస్య సర్వేలకు కొన్ని నెలలపాటు విరామం ఇచ్చారు. అయితే రాష్ట్రంలో టీడీపీ గల్లంతు కావడం... టీడీపీకి చెందిన కొంతమంది అగ్ర నాయకులు బీజేపీలో చేరడంతో కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మరోసారి రహస్య సర్వేలకు తెర తీస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో పారదర్శకమైన పాలన కొనసాగుతున్న నేపథ్యంలో తమ రహస్య సర్వేలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించదనే భయంతో కేంద్ర ప్రభుత్వం అండ ఉన్న కొంతమంది నాయకులను అడ్డం పెట్టుకుని మరోసారి రహస్య సర్వేలకు తెగబడుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో కొన్ని రకాల ఆంక్షలు ఉన్నప్పటికీ ఆయా నిక్షేపాలను తీసేందుకు అడ్డంకులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఎలాగైనా విలువైన నీలి గ్రానైట్ నిక్షేపాలను సొంతం చేసుకునేందుకు దిల్లీ, ముంబాయ్కు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలు స్కెచ్ వేసినట్లు సమాచారం.
రహస్య సర్వేల విషయంపై దృష్టి సారిస్తాం
సొంటినూరు కొండపై రహస్య సర్వేల విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. సొంటినూరు పరిసర ప్రాంతాల్లో కొండల పై గ్రానైట్ నిర్వహణకు ఇప్పటికే కొన్ని దరఖాస్తులు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేస్తాం.