ఒకప్పటి తెలుగుదేశం పార్టీ కంచుకోటకు బీటలు పడనున్నాయా!?.. ఆ పార్టీ తమ్ముళ్లు పక్క పార్టీ వైపు చూస్తున్నారా!? అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరం దూరంగా ఉంటున్నారా!? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీలో నేతల మధ్య విబేధాలు తీవ్రతరమై ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణికి దిగడంతో అప్పటి నుంచే పార్టీ పతనం ప్రారంభమైంది. ఇది చివరకు గత ఎన్నికల్లో టీడీపీ వాళ్లను టీడీపీ ఓడించుకునే వరకు వెళ్లిపోయింది.
ఇక ఇప్పుడు పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో ఎవరికి వారు తమదారి తాము చూసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఎన్నికల్లో ఓడిన నాలుగు నెలలకే పలువురు కీలక నేతలు బీజేపీలోకి వెళ్లిపోవడమో లేదా.. వైసీపీలోకి వెళ్లిపోవడమో చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ కాషాయం కండువా కప్పుకోగా... ఇప్పుడు ఆయన అనుచరులు మొత్తం కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
2018లో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఆర్థిక నేరారోపణలతో జైలు కెళ్లడం, ఆ తర్వాత బెయిల్పై విడుదల కావడంతో వాకాటి బీజేపీలో చేరుతారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అందుకు తగ్గట్టుగా వారం రోజుల క్రితం ఆయన కమల దళంలో చేరిపోయారు. తన అనుచరులనూ బీజేపీలోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీ గత రెండు ఎన్నికల్లోనూ చిత్తు చిత్తుగా ఓడిపోతూ వస్తోంది.
ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత అసలు ఆ పార్టీలో ఉండేందుకు ద్వితీయ శ్రేణి కేడర్ కూడా ఇష్టపడడం లేదు. ఇక ఇప్పుడు వాకాటి పార్టీ మారిపోవడంతో ఆయన బొమ్మన వర్గంతో పాటు సూళ్లూరుపేట, నాయుడుపేటకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు వాకాటి వెంట నడుస్తారని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే వీరిలో టీడీపీ నుంచే అత్యధిక మంది నేతలు, బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీ టోటల్గా ఖాళీ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.