ఏపీ సీఎం వైఎస్ జగన్ను మెగాస్టార్
చిరంజీవి కలవబోతున్నారు అన్న విషయం ఈపాటికే అందరికి తెలిసింది. సోమవారం మధ్యాహ్నం సీఎం క్యాంపు ఆఫీసులో జగన్ను చిరంజీవి, రామ్చరణ్ కలవనున్నారు. వీరు కలిసి లంచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని తెలియడంతో జగన్తో చిరు భేటీ పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. వీరి సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యం లేనప్పటికీ..... చిరంజీవితో పాటు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు అని జరుగుతోన్న ప్రచారం మరింత ఆసక్తి రేపుతోంది.
ఈ మధ్య విడుదలైన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీసిన
సైరా సినిమాకు అదనపు షోలు వేసుకోవడానికి
జగన్ సర్కారు అంగీకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ విషయంపై ఆయనకు థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే చిరు అపాయింట్మెంట్ కోరారని భావిస్తున్నారు అందరు.పనిలో పనిగా చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో... వినోదపు పన్ను మినహాయింపు కోరే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది.
అలాగే సైరా నరసింహారెడ్డి విడుదలై విజయపథంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని చూడవలసిందిగా ఆహ్వానించే నిమిత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని
చిరంజీవి కలువనున్నారు. వాస్తవానికి ఈ భేటీ నాలుగురోజుల ముందుగానే జరగాల్సి ఉంది. అయితే సీఎం ఢిల్లి పర్యటన నేపథ్యంలో వీరి భేటీ సోమవారానికి వాయిదా పడింది. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి కూడా చిరంజీవికి
జగన్ ఆహ్వానం పంపారు. తన ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనాలని కోరారు.
కానీ
పవన్ కళ్యాణ్కు కూడా ఆయన ఆహ్వానం పంపినప్పటికీ.... జనసేన పార్టీతో పవన్, జగన్కు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. దీంతో ఆ సమయంలో వెళ్ళితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ముఖ్య ఉద్దేశంతోనే, జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో
చిరంజీవి పాల్గొనలేదు. వేరే పలు కారణాలు ఉన్నా,ఇదే ముఖ్య కారణం అని చెప్పుకొస్తున్నారు. అప్పుడు తమ్ముడు పవన్ కోసం జగన్ ప్రమాణ స్వీకార వేడుకకు దూరంగా ఉన్న చిరు.. ఇప్పుడు తనయుడి కోసం ఆయన్ని కలవక తప్పలేదు.