వైసీపీ అధినేత వైఎస్ జగన్ లక్ష కోట్లు అవినీతి చేశాడని గతంలో తెలుగు దేశం పార్టీ తరచూ ఆరోపించేది.. అలా విమర్శించి విమర్శించి జనంలోకి లక్ష కోట్ల డైలాగ్ ను తీసుకెళ్లారు టీడీపీ నాయకులు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. చంద్రబాబు గత ఐదేళ్లలో 7 లక్షల కోట్లు అవినీతి చేశాడంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు.
రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి గత ఐదేళ్లలో దోచుకున్న రూ.7 లక్షల కోట్లను రాష్ట్ర ఖజానాకు పంపించు చంద్రబాబూ అని సుధాకర్బాబు అన్నారు. ఇసుక, మైనింగ్ ఇలా రాష్ట్రమంతా గజదొంగలను తయారు చేసి ఏజెంట్ రూపంలో కార్పొరేట్ దోపిడీ వ్యవస్థను చంద్రబాబు నడిపాడు. ఇలాంటి వ్యక్తికి రాజకీయ నాయకుడినని చెప్పుకునే అర్హత లేదన్నారు. రాజకీయ నాయకుడికి జాలి, దయ, ప్రేమ ఉండాలని, ఇప్పటికైనా సీఎం వైయస్ జగన్ను చూసి నేర్చుకో చంద్రబాబూ అని సూచించారు.
రైతులకు పెట్టుబడిసాయం అందించేందుకు నెల్లూరులో వైయస్ఆర్ రైతుభరోసా పథకాన్ని సీఎం ప్రారంభిస్తున్నారని చెప్పారు. పోలవరం రివర్స్టెండరింగ్లో మిగిలిన వేల కోట్ల రూపాయలు చంద్రబాబుకు కనబడడం అని ప్రశ్నించారు. అవినీతి రహిత పాలనే «ధ్యేయంగా సీఎం ముందుకు కదులుతున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ నేతృత్వంలోనే పోలవరం పూర్తవుతుందని చెప్పారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలన చూసి చంద్రబాబుకు మైండ్ బ్లాంక్ అయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే సుధాకర్బాబు అన్నారు. మంగళగిరిలో తనయుడు లోకేష్ను కనీసం ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయిన రోజే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయిందన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిలా సీఎం వైయస్ జగన్ ప్రజా నాయకుడిగా ఎదిగారన్నారు. అది చూసి అక్కసుతో చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పుకునే చంద్రబాబు ప్రజల్లో చిరకాలం నిలిచేలా ప్రవేశపెట్టిన పథకం ఒక్కటైనా చూపించగలరా అని ప్రశ్నించారు.