సందర్భానుసారంగా మాట్లాడటంలో ప్రధాని మోడీకి మించిన వ్యక్తులు ఉండరు. ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో అవన్నీ కూడా ప్రధాని మోడీకి వెన్నతో పెట్టిన విద్య. విదేశీయులతో మాట్లాడేసమయంలో హుందాగా, దేశానికీ తగినట్టుగా మాట్లాడతారు. దేశంలో ఇతర నాయకులతో మాట్లాడేసమయంలో.. నాయకుడిలా, ముందుండి నడిపించే వ్యక్తిగా మాట్లాడతారు. ఇక ప్రజలతో సంభాషించే సమయంలో వారిలో ఒకరిగా కలిసిపోయి మాట్లాడతారు.
అదే ఎన్నికల ప్రచారం విషయానికి వస్తే.. ప్రతి పక్షాలను ఇరుకున పడే విధంగా మాట్లాడతారు. వాళ్ళు సమాధానం చెప్పలేని విధంగా ప్రశ్నలు సంధిస్తూ ప్రసంగాలు ఉంటాయి. వాటిని సరైన సమాధానం ఏంటి అని వెతుక్కునే సరికి ఎన్నికపూర్తవుతాయి. ఎప్పటిలాగే బీజేపీ విజయం సాధిస్తుంది. ప్రస్తుతం హర్యానా, మహారాష్ట్రలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈనెల 21వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాని
మోడీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.
నిన్నటి రోజున
మోడీ హర్యానా ప్రచారంలో పాల్గొన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖట్టర్ ను ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడారు. బలమైన నాయకత్వం ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిడంలో బీజేపీ ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. ఇక ఇదిలా ఉంటె, ఈ ప్రచారంలోనే
మోడీ మరికొన్ని విషయాల గురించి మాట్లాడారు.
ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపోయేలా చేశారు. అయన మాట్లాడిన అంశాల్లో ప్రధానంగా ఆర్టికల్ 370 గురించి చర్చకు వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు చేసింది తాను కాదని, దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఆర్టికల్ 370ని రద్దు చేయాలనీ కోరుకున్నారని, ఆ ధైర్యంతోనే రద్దు చేశామని, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, లడక్ కు అభివృద్ధి పధంలో పయనించబోతున్నాయని అన్నారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేస్తున్నాయని, అది తగదని చెప్పారు మోడీ.