134 ఏళ్ళ అయోధ్య స్థల వివాదం కేసుపై నలభై రోజులుగా జరుగుతున్న విచారణలో భాగంగా బుధవారంనాడు సుప్రీంకోర్టులో హై డ్రామా చోటుచేసుకుంది. విచారణలో భాగంగా రాజ్యాంగ ధర్మాసనం ముందు అయోధ్య రీవిజిటెడ్ పేరుతో ఐపీఎస్ మాజీ అధికారి
కిశోర్ రాసిన పుస్తకాన్ని హిందూ మహాసభ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ఉంచారు. అయితే, ఈ పుస్తకాన్ని కోర్టు ముందుంచడంపై సున్నీ వక్ఫ్బోర్డ్ తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పుస్తకాన్ని సమర్పిస్తే చించేస్తాను, ఇది సుప్రీంకోర్టు తాను సీరియస్గా చెబుతున్నానని అంటూ హెచ్చరించారు.
వీటిని పట్టించుకోని వికాస్ సింగ్ తన వాదన వినిపిస్తుండగా అందులోని రామ జన్మస్థానం చూపిస్తున్న మ్యాప్ను, సీనియర్ న్యాయవాది
రాజీవ్ ధవన్ జోక్యం చేసుకుని ఆ పుస్తకాన్ని, మ్యాప్ను చించివేశారు. 1986 లో ముద్రితమైన ఈ పుస్తకాన్ని రికార్డుల్లోకి తీసుకోరాదని, దీనికి సంబంధించి కొత్త రికార్డులు కావాలని ఆయన పట్టుబట్టారు. చింపి వేయడం న్యాయమూర్తులకు ఆగ్రహం తెప్పించింది.
ఈ చర్యలను గమనించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే విచారణను మధ్యలోనే నిలిపేస్తానని, వాదనలు ఇలాగే కొనసాగిస్తే ఇప్పుడే వెళ్లిపోతామని మండిపడ్డారు. విచారణకు సహకరించాల్సింది పోయి గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి వాదనలు సాయంత్రం ఐదు గంటలకు ముగిస్తాయని జస్టిస్ రంజన్ గొగొయ్ స్పష్టం చేశారు. ఈ టైటిల్ సూట్ లో ముస్లిం వక్ఫ్ బోర్డు తరఫున వాదిస్తున్న
రాజీవ్ ధవన్ రామ జన్మస్థానాన్ని చూపించే చిత్రంతో కూడిన మ్యాప్ను చింపివేస్తూ......'దీన్ని చింపేయడానికి మీరు అనుమతిస్తారా!' అని న్యాయమూర్తులను ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో సీజేఐ రంజన్ గొగోయ్ మండిపడ్డారు. 'సభా మర్యాదాలు మంటగలిసాయి, మేము వాకౌట్ చేస్తాం' అని అన్నారు.
రాజకీయంగా అతి సున్నితమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై రోజువారి విచారణ ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. అయోధ్య కేసులో వాదనలకు మరింత సమయం ఇవ్వాలని ఒక లాయర్ కోరడంపై సీజేఐ వెంటనే స్పందిస్తూ 'సాయంత్రం 5 గంటలతో వాదనలు ముగిస్తాం. ఇంతటితో సరి. ఇప్పటి వరకూ జరిగింది చాలు' అని సీజేఐ స్పష్టం చేశారు. కాగా, అయోధ్య కేసులో తాము జరిపిన రెండో రౌండు చర్చలకు సంబంధించిన నివేదికను అయోధ్య మధ్యవర్తుల ప్యానెల్ ఇవాళ సమర్పించనుంది.
నవంబర్ 17న సీజేఐ రంజన్ గొగోయ్ పదవీవిరమణ చేయనున్నందున దీనికి ముందే 134 ఏళ్ల అయోధ్య వివాదంపై ఆయన తీర్పునిచ్చే అవకాశాలున్నాయి.