జనసేనకు గడ్డుకాలం నడుస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం.. ఆ తరువాత నేతల నిష్క్రమణతో పార్టీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. దానికితోడు పార్టీలో అంతర్గత విభేదాలు ముదురుతున్నాయన్న చర్చ జోరుగా నడుస్తోంది. తాజా పరిణామాలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.


జనసేనాని పవన్ కళ్యాణ్ తరువాత ఇంచుమించు నంబర్ 2గా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్‌ను సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారన్న ప్రచారం నడుస్తోంది. పార్టీ నుంచి వెళ్లగొట్టేలా ప్రయాత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. స్పీకర్‌ స్థానంలో ఉండి కూడా ప్రజా సమస్యలపై ఆయన స్పందించిన తీరు అప్పట్లో విమర్శల ప్రశంసలు అందుకుంది. తదనంతర పరిణామాలతో ఆయన పవన్ కళ్యాణ్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకుని జనసేనలో చేరారు.


పార్టీ కీలక కమిటీల్లోనూ ఆయనకు స్థానం కల్పించారు. అదే ఆయనకు మైనస్‌గా మారినట్లు తెలుస్తోంది. పవన్ తర్వాత మనోహర్‌కే ప్రాధాన్యం దక్కుతుండడంపై సొంతపార్టీ నేతలే గుర్రుగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది.అయితే ఇటీవల జరిగిన ఓ పరిణామం కూడా నాదెండ్లపై ఆగ్రహానికి కారణమైందన్న వాదనలూ ఉన్నాయి. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ ముందే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను కించపరుస్తూ వ్యాఖ్యానించారని, అది ఆయన అహంభావానికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి.


వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని తట్టుకుని ఎన్నికల్లో గెలిచి పార్టీ పరువు నిలిపిన ఎమ్మెల్యేని కనీస మర్యాద లేకుండా వ్యాఖ్యానించడంపైనా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.పవన్ కళ్యాణ్ ఆఫీసులో లేని సమయంలో నాదెండ్ల చెప్పినట్టు వినాల్సి వస్తోందని.. అది జీర్ణించుకోలేక ఆయనకు పొగబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో కొందరు నేతలు నాదెండ్లపై అసంతృప్తి గళం వినిపించినట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: