హర్యానా, మహారాష్ట్రలలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రాబోతున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ముఖ్యంగా ఆ రెండు రాష్ట్రాల గురించి ప్రస్తావించగా.. ఆయన పై విధంగా స్పందించారు. హర్యానా, మహారాష్ట్రాల్లో భాజపా అధికార పగ్గాలు చేపట్టబోతుందని జోశ్యం చెప్పారు. గాంధీ 150వ
జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా గాంధీ సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ మీడియాతో అరుణ్ సింగ్ మాట్లాడారు. న్యాయపరమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కిన కార్మికులను ఇంతలా అణచివేస్తున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని విమర్శించారు.
కార్మిక సంఘాలను ఎలాంటి చర్చలకు ఆహ్వానించకపోవడం తగదన్నారు. పైగా ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరించడాన్ని ఆయన ఆక్షేపించారు. 48 వేలమంది ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై చొరవ చూపాలని హైకోర్టు సూచించినా ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడంలేదన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయలేదన్నారు.
కావాలంటే టీఆర్ఎస్ నాయకులు విచారించుకోవచ్చని సవాల్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఆదివారం నాటికి 16వ రోజుకు చేరుకుందన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటంలో బీజేపీ చివరి వరకు ఉంటుందని చెప్పారు. శనివారం రోజున ఆర్టీసీ కార్మికులు చేపట్టున రాష్ట్ర వ్యాప్త బంద్లో పాల్గొన్న బీజేపీ నాయకులు లక్ష్మణ్తో పాటు చాలామందిని అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. కార్మికుల పక్షాన పోరాటం చేసే వాళ్లను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రభుత్వాన్ని అరుణ్ సింగ్ నిలదీశారు.