విశాఖ విమానాశ్రయం లో గత ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ బాబు టీ, కాఫీ, స్నాక్స్ కోసం చేసిన చేసిన ఖర్చు అక్షరాలా పాతిక లక్షల రూపాయలు అంటే ఆశ్చర్యమే మరి. అవును ... టీ, కాఫీ, స్నాక్స్ కోసం ప్రజాధనాన్ని వారిద్దరూ అడ్డగోలుగా ఖర్చు చేసినట్లు తెల్సింది . ఇప్పటికే సగం బిల్లులు చెల్లించిన జిల్లా ప్రోటోకాల్ అధికారులు , ఇంకా సగం బిల్లు చెల్లించడానికి తలలు పట్టుకుంటున్నారు . ఇంత పెద్ద మొత్తం సొమ్ము టీ, కాఫీ, స్నాక్స్ కోసం చెల్లించడం ఏమిటంటూ తమలో తామే మధనపడిపోతున్నారు .
టిడిపి ప్రభుత్వ హయాం లో అప్పటి మంత్రులతో సహా చంద్రబాబు, లోకేష్ లు విశాఖ జిల్లా పర్యటన కు వచ్చినప్పుడు , విశాఖ విమానాశ్రయం లో టీ, కాఫీ, స్నాక్స్ కోసం మొత్తంగా అయిన ఖర్చు పాతిక లక్షలని అధికారులు తెలియజేశారు. 2014 నుంచి 2016 వరకు టీ, కాఫీ, స్నాక్స్ కోసం అయినా దాదాపు 12 లక్షల రూపాయల బిల్లు ను ఇప్పటికే ఫ్యూజన్ రెస్టారెంట్ యాజమాన్యానికి అధికారులు చెల్లించారు. ఇక 2017 నుంచి 2019 మే 31 వరకు టీ, కాఫీ, స్నాక్స్ కోసం అయినా మొత్తం 13 , 44 , 444 రూపాయల బిల్లు చెల్లించాలంటూ ఫ్యూజన్ రెస్టారెంట్ యాజమాన్యం అధికారులను సంప్రదిస్తోంది .
టీ, కాఫీ, స్నాక్స్ కోసం లక్షల రూపాయల బిల్లు ఎలా చెల్లించాలో అర్థం కాక ప్రస్తుత జిల్లా అధికారులు జుట్టు పీక్కుంటున్నారు . వీవీఐపీ , వీఐపీలు ప్రయాణ సమయాల్లో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఫ్లైట్ టేకాఫ్ కు సమయం ఉంటే వీఐపీ లాంజ్ లో కాసేపు సేద తీరుతుంటారు . వారికి జిల్లా ప్రోటోకాల్ అధికారులు టీ, కాఫీ , స్నాక్స్ సరఫరా చేయడం ఆనవాయితీ . అయితే అది ఏ వందల్లో , వేలల్లో ఉంటే సరే సరి కానీ ఏకంగా లక్షల్లో ఉంటే ఎలా చెల్లిస్తామని జిల్లా అధికారులు ప్రశ్నిస్తున్నారు .