పుష్కరాల తొలిరోజు జరిగిన మహావిషాదానికి చంద్రబాబు నిర్వాకమే కారణమంటూ నేషనల్ ఛానల్స్ విరుచుకుపడుతున్నాయి. వీఐపీ తరహాలో చంద్రబాబు సాగించిన స్నానాది కార్యక్రమాలు.. దానికోసం ప్రజలను నిలిపేయడమే ఈ మహా దారుణానికి కారణమంటూ దుమ్మెత్తిపోసింది. వీఐపీల వివక్షను అంతం చేద్దాం అనే నినాదంతో ప్రముఖ నేషనల్ ఛానల్ టైమ్స్ నౌ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది.
ప్రజల భద్రతను పక్కకు పెట్టి మొదటిరోజు మొదటి గంటలోనే స్నానం చేయాలన్న చంద్రబాబు నిర్ణయమే 30 మంది ప్రాణాలు బలిగొందని టైమ్స్ నౌ యాంకర్ ఆర్ణబ్ గోస్వామి విరుచుకుపడ్డాడు. ఈ అంశంపై ఆ ఛానల్ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఆ చర్చకు ఏపీ మంత్రులు రఘునాథరెడ్డి, నారాయణలను లైవ్ డిస్కషన్ కు ఆహ్వానించి.. ఆ తర్వాత కడిగిపారేశాడు.
బదులు చెప్పలేకపోయిన ఆంధ్రా మంత్రులు..
30 మంది భక్తుల ప్రాణాలు తీసిన ఈ నేరానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆర్ణబ్ గోస్వామి ఆంధ్రా మంత్రులపై రంకెలేశాడు. మామూలుగానే ఆర్ణబ్ అరుపులు తట్టుకోలేం. ఇక ఇలాంటి సీరియస్ అంశంలో వదిలిపెడతాడా.. పాపం.. ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు పల్లె రఘునాథరెడ్డి, నారాయణ నానా తంటాలు పడ్డారు. నీళ్లు నమిలారు.
చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి ఆ హోదాలోనే.. తొలిరోజు స్నానం చేశారని రఘునాథరెడ్డి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించి.. మరో నాలుగు మొట్టికాయలు వేయించుకున్నారు. ముఖ్యమంత్రి అయితే ప్రజల ప్రాణాలు పోయేలా ప్రవర్తిస్తారా అంటూ ఆర్ణబ్ మండిపడ్డారు. ఉదయం ఆరు గంటల 26 నిమిషాలు పవిత్ర సమయం కావడం వల్లే జనమంతా అదే సమయంలో స్నానానికి ప్రయత్నించి ఈ దుర్ఘటనకు కారణమయ్యారని నారాయణ వివరణ ఇచ్చారు. ఆర్ణబ్ ఆయన్నూ వదలిపెట్టలేదు. మరి అంతమంది వస్తారని తెలిసి సీఎం ఆ ఘాట్ కే ఎందుకు వెళ్లారు.. తెలిసి కూడా తప్పుచేసినట్టేకదా.. అని ఆర్ణబ్ కార్నర్ చేశారు. మొత్తానికి పుష్కర ప్రమాదంతో బాబు పరువు జాతీయస్థాయిలో పోయేలా ఉంది.