కోర్టు నుంచి అనుమతి లభించడంతో శుక్రవారం అర్థరాత్రి మెట్రో సిబ్బంది చెట్లను కూల్చేందుకు ప్రయత్నించారు. దాదాపు 200 చెట్ల వరకు అధికారులు కూల్చివేయగా ఇదే సమయంలో భారీ ఎత్తున స్వచ్ఛంద, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు. దీంతో సిబ్బంది వెనక్కి తగ్గి పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై నాన్—బెయిల్బుల్ కేసు నమోదుచేసి, అక్కడ 144 సెక్షన్ విధించారు.
అభివృద్ధి పేరుతో పర్యావరణానికి హానితలపెట్టే చర్యలను మానుకోవాలని ఉద్యమకారులు మండిపడుతున్నారు. వీరి వాదనకు శివసేన మద్దతు తెలిపింది. చెట్లకు బదులు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలను కూల్చివేయాలని ఆ పార్టీ యువనేత ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితిలో భారత ప్రధాని వాణికి విరుద్ధంగా ముంబయి మెట్రో చేస్తున్న పనులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఓ వైపు పర్యావరణాన్ని ముంబయి మెట్రో ధ్వంసం చేస్తుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ పరిరక్షణపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు.
సుమారు 2,700 చెట్లను కూల్చివేయడానికి సిద్ధమైనట్టు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించగా.. 1287 హెక్టార్ల మేర విస్తరించి ఉన్న ఆరే కాలనీ ముంబయి మహా నగరానికి ఊపిరితిత్తుల లాంటిదని పలువురు సామాజిక కార్యకర్తలు వాదిస్తున్నారు. ఈ అంశంపై దాదాపు ఐదేళ్లుగా పర్యావరణ వేత్తలు, ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ మధ్య పోరాటం సాగుతోంది.