పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 26వ టెస్టు సెంచరీ. కెప్టెన్గా 19వ సెంచరీ కాగా... అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీకి 69వ సెంచరీ.
అయితే, శుక్రవారం తొలిరోజు ఆటలో భాగంగా సఫారీ పేసర్ కగిసో రబాడను విరాట్ కోహ్లీ ఆట పట్టించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీమిండియా ఇన్నింగ్స్ 66వ ఓవర్లో విరాట్ కోహ్లీ బంతిని పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న రబాడ వైపుగా ఆడాడు. అదే సమయంలో వేగంగా పరుగు తీసేందుకు ప్రయత్నించాడు.
బంతిని బలంగా విసిరిన రబాడ
ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న రబాడ బంతిని వంగి అందుకొని వికెట్ల వైపు బలంగా విసిరాడు. అయితే, ఆ బంతి వికెట్లకు దూరంగా బౌండరీ లైన్ను తాకింది. విరాట్ కోహ్లీ రనౌట్ మిస్ కావడంతో పాటు అదనంగా నాలుగు పరుగులు లభించడంతో కోహ్లీ దక్షిణాఫ్రికా ఫీల్డర్లను ఆటపట్టిస్తూ థమ్స్ అప్ సింబల్ చూపించాడు.
వీడియో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం టీ విరామానికి టీమిండియా 141 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 473 పరుగలతో పటిష్టంగా ఉంది. విరాట్ కోహ్లీ(194), జడేజా(25) పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ సాధించడంతో అనేక రికార్డులు నెలకొల్పాడు.
కెప్టెన్గా పాంటింగ్ రికార్డు సమం
వీరిద్దరూ కెప్టెన్గా టెస్టుల్లో 19 సెంచరీలు సాధించారు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(25 సెంచరీలు)తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన అలెన్ బోర్డర్(15), స్మిత్(15), స్టీవ్ వా(15) సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు తన 26వ టెస్టు సెంచరీతో విరాట్ కోహ్లీ మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రికార్డుని కూడా బద్దలు కొట్టాడు.
గవాస్కర్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ
టెస్టుల్లో 26 సెంచరీలు సాధించేదుకు కోహ్లీకి 138 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. అదే సునీల్ గవాస్కర్ ఈ మైలురాయిని 144 ఇన్నింగ్స్ల్లో అందుకున్నాడు. ఇక, ఈ జాబితాలో ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్ మన్(69 ఇన్నింగ్స్లు)తో అగ్రస్థానంలో ఉండగా... స్టీవ్ స్మిత్(121), సచిన్ టెండూల్కర్(136) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.