ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షహాబాజ్ నదీమ్ తాజాగా సౌతాఫ్రికా తో జరుగుతున్న మూడో టెస్ట్ ద్వారా అంతర్జాతీయ టెస్ట్
క్రికెట్ లో కి ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి నదీమ్
సౌత్ ఆఫ్రికా తో సిరీస్ కు ఎంపిక కాలేదు. కానీ చైనా మెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ భుజం గాయం తో మూడో టెస్ట్ కు ముందు చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఆ స్థానం లో నదీమ్ ను తీసుకుంది మేనేజ్ మెంట్. ఇటీవల వెస్టిండీస్ ఏ తో జరిగిన అనధికార టెస్ట్ సిరీస్ లో
ఇండియా ఏ తరుపున ప్రాతినిధ్యం వహించిన నదీమ్ అదరగొట్టాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో పది వికెట్లతో చెలరేగిన నదీమ్.. చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో సత్తా చాటాడు. విండీస్ కోల్పోయిన ఆరు వికెట్లలో నదీమ్ ఒక్కడే ఐదు వికెట్లు సాధించాడు. ఈ ప్రదర్శనే నదీమ్ ఇప్పుడు సౌతాఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ కు ఎంపిక అయ్యేలా దోహద పడింది.
ఇక ఐపీఎల్ లో భాగంగా 2012 లో నదీమ్ ను ఢిల్లీ కొనుగోలు చేయగా ఆ సీజన్ లో అతను రైజింగ్ స్టార్ అఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. కాగా నదీమ్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత ఏడాది వెస్టిండీస్ తో జరిగిన అంతర్జాతీయ టీ 20 సిరీస్ కు నదీమ్ ఎంపిక కాగా.. ఆ సిరీస్ లో ఆడే అవకాశం రాకపోవడంతో బెంచ్ కే పరిమితమయ్యాడు. మరి తాజాగా రాంచి టెస్ట్ ద్వారా టీమిండియా తరుపున అంతర్జాతీయ టెస్ట్
క్రికెట్ లోకి అడుగు పెట్టిన ఈ బీహార్ బౌలర్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఈమ్యాచ్ లో భారత్ ముగ్గురు స్పిన్నర్ల తో బరిలోకి దిగింది. నదీమ్ కు తోడు సీనియర్ స్పిన్ బౌలర్లు అశ్విన్ , జడేజా తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.