వచ్చే ఏడాది ఆస్ట్రేలియా లో జరగనున్న ప్రపంచకప్ టి- 20 టోర్నీ కి నెదర్లాండ్స్ జట్టు అర్హత సాధించింది. ఐసీసీ ప్రపంచ కప్ అర్హత టోర్నీ దుబాయి వేదికగా జరుగుతోంది . ఈ టోర్నీ విజేతగా నిలిచినా జట్టుతో పాటు , రన్నరప్ నిలిచిన జట్లు ప్రపంచకప్ టి- 20 టోర్నీ కి అర్హతను సాధించాయి . టి20 ప్రపంచకప్ క్వాలిఫైర్ మ్యాచ్ లో నెదర్లాండ్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ ) జట్టును మట్టికరిపించింది .
తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 80 పరుగులు మాత్రమే సాధించింది. కేవలం 9 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి యూఏఈ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. అహ్మద్ ( 22 ), వాహబ్ (19 )లు పర్వాలేదనిపించడంతో, గౌరవ ప్రదమైన స్కోరు సాధించగలిగింది. నెదర్లాండ్ జట్టు గ్లోవర్ రాణించి నాలుగు వికెట్లు చేజిక్కించుకుని , ప్రత్యర్థి జట్టు వెన్నువిరిచాడు . అనంతరం స్పల్ప లక్ష్య సాధనతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలో విజయ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించి విజయాన్ని నమోదు చేసుకుని ప్రపంచ కప్ టి 20 కి బెర్త్ సాధించింది .
బెన్ కూపర్ అజేయంగా 41 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గ్లోవర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నిలిచాడు . ఇప్పటికే టి 20 న్యూగినియా , ఐర్లాండ్ జట్లు అర్హత సాధించిన విషయం తెల్సిందే . ఆస్ట్రేలియా లో జరగనున్న ప్రపంచ కప్ టి 20 టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .