టీమిండియా మాజీ క్రికెటర్  ప్రవీణ్‌ కుమార్‌ తాను తప్పతాగి పక్కంటి వారిపై దాడి చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని  స్పష్టం చేశాడు. ప్రవీణ్‌ కుమార్‌ దీనిపై మాట్లాడుతూ ... తాను ఎప్పుడూ చీమకు కూడా హాని కల్గించనని, మరి అటువంటిది తాగి ఒక అబ్బాయిపై, అతని తండ్రిపై దాడి చేశానంటూ ఫిర్యాదు చేయడం బాధించిందన్నాడు. కాగా, ఆ అబ్బాయి తండ్రి దీపక్‌ శర్మనే తనపై చేయి చేసుకున్నాడని పేర్కొన్నాడు. ‘ నేను అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ ఆడా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కనీసం ఎప్పుడూ చీమను కూడా నేను చంపలేదు. అటువంటప్పుడు ఒక  అబ్బాయిపై దాడి ఎందుకు చేస్తాను.

 

ఆ అబ్బాయి, అతని తండ్రి  మా ఇంటికి సమీపంలో కలిసి నాతో గొడవ పడ్డారు. వారిద్దరూ నేను కారులో ఉన్న సమయంలో  నన్ను బయటలాగి మరీ దాడి చేశారు. ఇలా నేను తాగి వారిని కొట్టాననడం అంతా అబద్ధం. అంతేకాకుండా నా గొలుసును లాక్కోవడానికి వారు ప్రయత్నించారు.  నాపై ఇక్కడ స్థానిక రాజకీయాలతో ఇలా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎప్పుడూ ఇక్కడ పెద్దగా ఉండను. నాకు రెండు-మూడు ఇళ్లులున్నాయి. నేను కేవలం ఇక్కడ పెయింట్‌ వర్క్‌ ఎలా జరుగుతుంది అది  చూద్దామనే వచ్చా. చాలామంది ఇతరుల సక్సెస్‌ చూసి ఓర్వలేరు. నా ఇమేజ్‌ను డామేజ్‌ చేయాలని చూశారు’ అంటూ ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నాడు.

 

టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడిన ప్రవీణ్ కుమార్ కాస్త దూకుడు  స్వభావం కలిగిన వాడు. అతడు గతంలో కూడా తప్ప తాగి గొడవ పడిన సంఘటనలు ఉన్నాయి. మొదట్లో అతడి క్రికెట్ కెరీర్  సాఫీగా సాగినా ఫామ్ ను కోల్పోయి టీమిండియాలో స్థానం కోల్పోయాడు.

 

అయితే ప్రవీణ్ కుమార్ ఫుల్లుగా తాగి తన పక్కింట్లో ఉండే వ్యక్తిని, అతడి కొడుకుని కొట్టాడని పిర్యాదు అందటంతో వారిద్దరూ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  భారత్‌ తరఫు ఆరు టెస్టులు, 68 వన్డేలు ఆడిన ప్రవీణ్‌ కుమార్‌ 104 వికెట్లు తీశాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: