ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియాలో  టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పోస్ట్‌ పెట్టడమే ఆలస్యం వాటిపైన  ఎప్పుడెప్పుడా అని  రెడీగా  ఆడేసుకోవడానికి నెటిజన్లు.. సెటైర్లు వేద్దామని అతడి హేటర్స్‌.. ఫన్నీగా స్పందించాలని మాజీ క్రికెటర్లు ఎదురు చూస్తుంటారు. అయితే ఏది ఏమైనా  సోషల్‌ మీడియాలో రవిశాస్త్రికి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడిన మాట వాస్తవం.రవిశాస్త్రి   ప్రస్తుతం న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌లో మునిగితేలుతున్నాడు. 

 

ఈ సందర్భంగా అతడు బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, నటి రవీనా టాండన్‌, వ్యాపారవేత్త గౌతమ్‌ సింగానియాలతో కలిసి దిగిన ఫోటోను తాజాగా సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు.  ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈ ఫోటోకు కొందరు ఫన్నీగా కామెంట్‌ చేస్తుండగా.. మరికొంత మంది  న్యూఇయర్‌ విషెస్‌ రవిశాస్త్రికి  తెలుపుతున్నారు. ఇక ఇంగ్లండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ సైతం రవిశాస్త్రి షేర్‌ చేసిన ఫోటోకు లైక్‌ కొట్టి న్యూఇయర్‌ విషెస్‌ తెలిపాడు. 

 

ఇక అంతకుముందు రవిశాస్త్రి  టీమిండియా క్రికెటర్లకు ఇంగ్లీష్‌ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపాడు.  అద్భుతంగా 2019లో రాణించారని, అదేవిధంగా  వచ్చే సరికొత్త సవాళ్లకు 2020లో సిద్దంగా ఉండాలని ఆయన సూచించాడు. విరామ సమయాన్ని ఎంజాయ్‌ చేయండి, 2020లో కలుద్దామంటూరవిశాస్త్రి సోషల్ మీడియాలో  ట్వీట్‌ చేశాడు. ఇక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ ఓటమి మినహా మిగతా అన్ని సిరీస్‌ల్లోనూ కోహ్లి సేన అదరగొట్టింది. 

 

ఇక  టీమిండియాకు  రానున్న ఏడాదిలో అతిపెద్ద సవాల్‌ టీ20 ప్రపంచకప్‌ రూపంలో ఎదురుకానుంది. అంతేకాకుండా ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడనుంది. వెస్టిండీస్‌ సిరీస్‌ ముగిశాక టీమిండియా క్రికెటర్లకు స్వల్ప విరామం లభించింది. దీంతో ఈ గ్యాప్‌లో క్రికెటర్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జనవరి 5న శ్రీలంకతో టీమిండియా తొలి టీ20 ఆడనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: