టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మకు తీవ్ర గాయం అయింది. దీంతో ప్రపంచకప్ ముందు టీమిండియాకు షాక్ తగిలింది. రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ముంబై గత మ్యాచ్లో సన్రైజర్స్పై మంచి విజయం సాధించడంతో.. ఈ రోజు జరిగే మ్యాచ్లో కూడా విజయం సాధించి పాయింట్లను పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ముంబై జట్టు ప్రాక్టీస్ షెషన్ లో పాల్గొంది. ఈ మ్యాచ్కోసం రోహిత్ సాధనలో భాగంగా మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ డైవ్ చేశాడు.
ఆ సమయంలో కుడికాలు కండరాలు పట్టేయడంతో నొప్పితో గ్రౌండ్లోనే విలవిల్లాడాడు. జట్టు వైద్యుడు నితిన్ పటేల్ వచ్చి రోహిత్ను మైదానం నుంచి తీసుకెళ్లాడు. రోహిత్కు పెద్ద గాయమే అయినట్లు సమాచారం తెలుస్తోంది. గాయం నుంచి కోలుకోవడానికి కనీసం రెండు నుంచి ఆరు వారాల విశ్రాంతి అవసరమట.కాకపోతే..రోహిత్ గాయం గురించి ఆ జట్టు యాజమాన్యం ఇప్పటి వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.రోహిత్ గాయంపై ముంబై యాజమాన్యం నోరువిప్పుతే గాని సమాచారం తెలిసేలాలేదు.
ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టును ఏప్రిల్ 15న బీసీసీఐ ప్రకటించనుంది. మే 30న ప్రారంభమయ్యే ప్రపంచకప్లో జూన్ 5న భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. 2015 ప్రపంచకప్ సమయంలోనూ రోహిత్కు ఇదే పరిస్థితి ఎదురైంది. రోహిత్ శర్మ గాయం క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. రోహిత్ ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగేది అనుమానమే.