ఐపీఎల్ 12 ఫైనల్లో ముంబయి జట్టు సంచలనం సృష్టించింది. ముంబయి ఇండియన్స్‌ నాలుగో సారి ఐపీఎల్‌ ఛాంపియన్‌గా అవతరించింది. ఆ జట్టు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ సరిగ్గా ఒక్క పరుగు దూరంలో చతికిలపడింది. తక్కువ స్కోర్లే అయినా అద్భుతమైన ముగింపుగా నిలిచింది. చివరి బంతి వరకు విజయం దోబూచులాడింది. బుమ్రా, రాహుల్‌ చాహర్‌ల అద్భుత బౌలింగ్‌ ముంబయిని గెలిపించింది. వాట్సన్‌ పోరాటం వృథా మిగిలింది.  


లక్ష్యం 150 పరుగులు కాగా... చెన్నై సూపర్‌ కింగ్స్‌ 148 పరుగుల వద్దే నిలిచిపోయింది. అంతకుముందు టాస్ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి 8 వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (41; 25 బంతుల్లో 3×4, 3×6) అత్యంత కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 

ముంబయికి క్వింటన్‌ డికాక్‌ (29; 17 బంతుల్లో 4×6), రోహిత్‌ శర్మ (15; 14 బంతుల్లో 1×4, 1×6) చక్కని ఆరంభాన్నిచ్చారు. భారీ సిక్సర్లు బాదేశారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని శార్దూల్‌ ఠాకూర్‌ విడదీశాడు. రోహిత్‌ను దీపక్‌ చాహర్‌ పెవిలియన్‌ పంపించాడు. ఒక దశలో ముంబై స్కోరు 180 వరకూ వెళ్తుందనుకున్నారు కూడా. 

కానీ తక్కువ లక్ష్యం ఉన్నా చెన్నై సూపర్ కింగ్స్ దాన్ని అందుకోలేకపోయింది. షేన్‌ వాట్సన్‌ అద్భుతంగా ఆడినా ఫలితం లేకపోయింది. కృనాల్‌ పాండ్య వేసిన 3.6వ బంతిని ఆడబోయి డుప్లెసిస్‌ (26; 13 బంతుల్లో 3×4, 1×6) స్టంపౌటయ్యాడు. జట్టు స్కోరు 82 వద్ద ధోనీ (2; 8 బంతుల్లో) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. అంతకుముందు బుమ్రా వేసిన 10.3వ బంతిని ఆడబోయి అంబటి రాయుడు (1; 4 బంతుల్లో) పెవిలియన్‌ చేరాడు. 

ప్రతి రెండేళ్లకోసారి ఐపీఎల్ గెలిచే ముంబై సంప్రదాయం కొసాగింది. 2013, 2015, 2017లో ముంబై విజేతగా నిలిచింది. ఇప్పుడు 2019లోనూ కప్పు గెలిచి సత్తా చాటింది. ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టు ముంబైనే. ఐదోసారి ఐపీఎల్‌ ట్రోఫీ అందుకున్న ఏకైక ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: