వైజాగ్ లో దక్షిణాఫ్రికా తో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ అరుదైన ఫీట్ సాధించాడు. ఒక టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ లలో సెంచరీ సాధించిన ఆటగాడిగా తన పేరు రోహిత్ రికార్డు పుటల్లో నమోదు చేసుకున్నాడు. పుష్కర కాలం క్రితం భారత జట్టులోకి అడిగిన రోహిత్ శర్మ పై మొదటి నుంచి అతని ఆటతీరు పై అనేక విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి .
రోహిత్ సాంకేతికంగా ఎంతో చక్కటి బ్యాట్స్ మెన్ అయినప్పటికీ , నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకుంటాడని , ఇక విదేశీ పిచ్లపై సరిగ్గా ఆడలేడని తరుచూ క్రీడా పరిశీలకులు విమర్శకులు గుప్పిస్తూ వస్తున్నారు . విమర్శకులకు మాటలతో కాకుండా రోహిత్ తన బ్యాట్ తోనే సమాధానం చెబుతున్నాడు . విదేశీ పిచ్ లపై సరిగ్గా ఆడలేదన్న వారికి ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో శతకాల మీద శతకాలు బాది తాను ఎక్కడైనా సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు. వన్డేలకు టి20 లకు అతికినట్టుగా సరిపోయే రోహిత్, టెస్ట్ క్రికెట్ కు పనికిరాడన్న వారి విమర్శలను పటాపంచలు చేశాడు .
టెస్టు జట్టులో తనకు స్థానమే ప్రశ్నార్థకం గా మారిన నేపధ్యం లో ఓపెనర్ అవతారమెత్తిన రోహిత్ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. వైజాగ్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో రోహిత్ భారీ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసింది. ఇక రెండవ ఇన్నింగ్స్ లోనూ కూడా సెంచరీ సాధించిన రోహిత్... ఒకవైపు అవసరానికి తగ్గట్టుగా ఆడుతూనే మరొకవైపు వేగంగా పరుగులు నమోదు చేసి జట్టు భారీ స్కోరుకు పునాది వేశాడు.