ఆడవాళ్ళకి కరివేపాకు అంటే పోపులో వేయడమే అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. మనం కూరల్లో వేసే కరివేపాకు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. రోజూ కరివేపాకును భోజనంలో కలిపి తినటం వలన మూత్రపిండ సమస్యలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. భోజనంలో కలిపిన కరివేపాకు ఆకులను తినటానికి ఇష్టపడకపోతే, రోజుకు రెండు సార్లు కరివేపాకు రసాన్ని తాగటం వలన కూడా మూత్రపిండ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఒక్క ఆరోగ్య సమస్యలే కాదు ఆడవాళ్లు అందానికి కూడా కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది.
కరివేపాకు గుజ్జు, శనగపిండి, పాలు లేదా పెరుగు వేసి బాగా కలిపి ఈ పేస్ట్ని ముఖానికి రాసుకుని పావు గంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై ఉన్న మొటిమలు, వాటి వల్ల వచ్చే మచ్చలు తగ్గుముఖం పడతాయి.
ఇంకా కరివేపాకును స్మూత్గా పేస్ట్ చేసి, అందులో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. పావు గంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకున్న మలినాలు తొలగి కాంతివంతగా మారుతుంది.
అదేవిధంగా, జుట్టు బాగా పెరగాలనుకునేవారు కరివేపాకుని నీళ్లల్లో వేసి మరిగించాలి. ఆ నీటిని తలకు మర్దన చేసుకోవాలి. పావుగంట తర్వాత మామూలు నీళ్లతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కరివేపాకును రుబ్బుకుని ఆ రసంలో మూడు స్పూన్ల మెంతి పొడిని కలిపి జుట్టుకు ప్యాక్లా వేసుకుని, ఎండిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే తెల్లజుట్టు నలుపుగా మారిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నూనె ను వేడి చేసి దానిలో కరివేపాకు ఆకులు వేసి ఈ మిశ్రమాన్ని 10-15 నిమిషాలు ఉంచాలి. తరువాత నూనె ను చల్లబరచాలి. ఆపై అ నూనె తో మీరు మీ జుట్టును మసాజ్ చేయాలి దీని వలన జుట్టు రాలడం మరియు చుండ్రు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు