కరోనా మహమ్మారిపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను బుధవారం కేంద్ర కేబినెట్ తీవ్రంగా పరిగణించింది. వైద్యులపై దాడులకు చెక్ పెట్టేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏకంగా ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. 1897 ఎపిడెమిక్ చట్టంలో మార్పులు తెస్తూ ఈ ఏడాదిలోగా విచారణ పూర్తయ్యేలా ఆర్డినెన్స్ను తీసుకురానుంది. కరోనా సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఆర్డినెన్స్ అమల్లో ఉండనుంది. కేంద్ర మంత్రివర్గ భేటీ అనంతరం మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. దాడులకు పాల్పడితే కేవలం 30 రోజుల్లో విచారణ చేపట్టి ఐదు నెలల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని, నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
అంతేగాకుండా.. వైద్యులపై దాడులకు పాల్పడేవారికి రూ లక్ష నుంచి రూ ఐదు లక్షల వరకూ జరిమానా విధిస్తామని చెప్పారు. వాహనాలు, ఆస్పత్రులపై దాడిచేస్తే వాటి మార్కెట్ విలువ కంటే రెండింతలు వసూలు చేస్తామని అన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆరోగ్య సిబ్బందికి రూ 50 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు.