ఇప్పుడు ఏపీలో మంత్రి వర్గ కూర్పు విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరు బీసీ వర్గానికి చెందిన మంత్రులు అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ ఇద్దరూ కూడా రాజ్యసభకు వెళుతున్నారు. వీరిద్దరు మండలి నుంచి ప్రాథినిత్యం వహిస్తుండడంతో రెండు కేబినెట్ పోస్టులు ఖాళీ కానున్నాయి. ఇప్పుడు వీరిద్దరి స్థానాల్లో కొత్త మంత్రులను తీసుకోవాల్సి ఉంది. ఇక వీరి సంగతి ఇలా ఉంటే మరి కొంత మంది మంత్రులను తప్పిస్తారన్న ప్రచారం వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. కోస్తా ప్రాంతానికి చెందిన ఒక కీలక నేతను కేబినేట్ నుంచి తప్పించే అవకాశం ఉంది అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది.
సదరు నేత మీద సిఎం జగన్ కి మంచి అభిప్రాయం లేదని ఆయన అందుకే ఇటీవల కొన్ని కార్యక్రమాలకు కూడా సదరు మంత్రి గారిని రానీయడం లేదు అని వార్తలు వస్తున్నాయి. ఇక రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక నేత మీద కూడా జగన్ కి మంచి అభిప్రాయం లేదని ఆయనను కూడా కేబినేట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఓవరాల్గా చూస్తే బీసీ వర్గాలకు చెందిన ముగ్గురు మంత్రులు కేబినెట్ నుంచి తప్పుకోనున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నారు.
ఇటీవల వైసీపీలో మంత్రి వర్గ కూర్పు విషయంలో అనేక చర్చలు జరిగాయి. మోపిదేవి, పిల్లి సుభాష్ స్థానంలో ఎవరిని తీసుకుంటారు అనే దాని మీద ఏ స్పష్టత ఎవరికి రావడం లేదు. అయితే కొత్తగా కేబినెట్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటోన్న వారిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువుగా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో రెండు నుంచి నాలుగు సార్లు గెలిచి మంత్రి పదవి ఆశిస్తోన్న వారు ఏకంగా 20 మంది వరకు ఉన్నారు. వీరు ఇప్పటికే పదవి రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరి జగన్ వీరిని ఎలా సముదాయిస్తారో ? చూడాలి.
ఇక ఓ మహిళా ఎమ్మెల్యే కేబినెట్లోకి ఎంట్రీ ఇస్తోందన్న వార్తల నేపథ్యంలో అప్పుడే పార్టీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయట. ఎంతో జూనియర్ అయిన ఆ మహిళకు కేబినెట్లో చోటు ఇస్తే నా పరిస్థితి ఏంటీ అని రోజా కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఓవరాల్గా కేబినెట్ నుంచి బయటకు వెళుతోన్న ఇద్దరి స్థానాల భర్తీతో పాటు మొత్తం నలుగురైదుగురు కొత్త మంత్రులు జగన్ కేబినెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.