టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహరాజుగా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ. ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రవితేజ చిన్న చిన్న పాత్రలు వేస్తూ ‘ఇడియట్’ సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత వరుస విజయాలతో టాప్ హీరోగా ఎదిగారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన పవర్ సినిమా తర్వాత రవితేజకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకున్నారు. ఆ మద్య రవితేజ పై రక రకాల రూమర్లు కూడా పుట్టుకొచ్చాయి..మనోడి కెరీర్ ముగిసిందని కామెంట్స్ వినిపించాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ..‘రాజా ది గ్రేట్’ సినిమాతో దుమ్మురేపాడు. రవితేజ ఈ సినిమాలో అంధుడిగా కనిపించినా..ఫుల్ లెన్త్ కామెడీ, యాక్షన్ తో తనదైన స్టైల్లో ఇరగదీశాడు. ఇదే ఊపుపై ‘టచ్ చేసి చూడు’ సినిమాలో నటించినా..అది పెద్ద విజయం కాలేదు.
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టికెట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో రవితేజ గాయపడ్డాడని రీసెంట్గా పలు వార్తలు వచ్చాయి. దీనిపై దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఇదంతా కేవలం పుకారు మాత్రమేననీ ..ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో పల్లెటూరి నేపథ్యంలో రూపొందుతోన్న 'నేల టికెట్' సినిమా ద్వారా మాళవికా శర్మ హీరోయిన్ గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.
తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమెకు స్వల్పగాయాలయ్యాని చిత్రయూనిట్ తెలిపింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆమె విశ్రాంతి తీసుకుంటోంది. దీంతో సినిమా షూటింగ్కి తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. సమ్మర్లో సినిమా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. నాని-నాగార్జున హీరోలుగా వస్తోన్న మల్టీస్టారర్లోను మాళవిక నటిస్తున్నారు. ఇందులో ఆమె నానికి జోడీగా కనిపించనున్నారు.