ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసి, ఇప్పుడు వివాదాస్పద చిత్రాలతో నిత్యం వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ ఆధ్వర్యంలో రూపొందిన సినిమా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. మొదట ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్ తో మొదలై నవంబర్ 29న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా టైటిల్ వివాదంలో ఇరుక్కొని ఫైనల్ గా టైటిల్ చేంజ్ చేసుకొని.. రిలీజ్ కు కొన్ని గంటల ముందే సెన్సార్ అవరోధాలు దాటుకుని ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వర్మ శిష్యుడు సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏపీ పాలిటిక్స్పై అనేక స్పూప్ సీన్లు బాగా పేలాయి.
ఇక ముఖ్యంగా ఏపీ సీఎంగా ఉన్న జగన్మోహన్రెడ్డి కేరెక్టర్లో నటించిన అజ్మల్ అమీర్ నటన చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ను జగన్ కేరెక్టర్ కు తగ్గట్టుగా మార్చేందుకు వర్మ చాలా కసరత్తులు చేశాడని స్పష్టంగా తెలుస్తోంది. అయితే సినిమాలో ఈ కేరెక్టర్ పేరు విఎస్ జగన్నాథరెడ్డి. అసెంబ్లీలో సీఎంగా జగన్నాథ్ రెడ్డి మాట్లాడడం... ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడం.. ప్రెస్ మీట్లు పెట్టడం ఇలా చెపుతూ పోతే ఎన్నో సీన్లలో అజ్మల్ జగన్ను అనుకరించేందుకు చేసిన ప్రయత్నం మెచ్చుకోతగ్గదే.
ఇక అజ్మల్తో పాటు మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. ఇక చివర్లో వర్మను టీవీ 5 యాంకర్ జాఫర్ ఇంటర్వ్యూ చేస్తాడు. ఈ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ సినిమా అయినా, రాజకీయమైనా, టీవీ అయినా, గేమ్స్ అయినా, ఇలా ఏదైనా ప్రజలు కోరుకునేది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే అంటాడు. దీని ప్రకారం చూసుకుంటే.. వర్మ అమ్మ రాజ్యం సినిమాలో ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా ఈ సినిమాను సినిమాగా చూసి ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు మాత్రం మంచి ఎంటర్టైన్ మెంట్ ఇచ్చాడు. ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న ఓ వర్గం ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ఇక నచ్చని వాళ్లకు ఎలాగూ నచ్చదు.