తెలుగువారి ఆడపడుచు నిర్మలా సీతారామన్ పేరు సమకాలీన రాజకీయాల్లో మార్మోగుతోంది. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రక్షణ శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో సేవలు అందించి సమర్ధవంతమైన మహిళగా మంత్రిగా పేరుకెక్కిన ఈమె ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించారు. 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నరేంద్ర మోడీ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన ఏర్పాటైన మంత్రి మండలిలో ఆర్థికశాఖ మంత్రిగా నియమితులయ్యారు. దానికి అదనంగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా ఆమెకే కేటాయించారు.
భారత ఉక్కుమహిళగా ప్రఖ్యాతి గాంచిన మాజీప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఆర్థికమంత్రిగా ఈ ఘనత దక్కించుకున్న మహిళగా నిలిచారు నిర్మలా సీతా రామన్ ఇందిరా గాంధీ 1970-71లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఇప్పటి వరకు పనిచేసిన దేశ ఆర్థిక మంత్రుల్లో వీరిద్దరే మహిళలు కావడం గమనార్హం. తమిళనాడు లోని మదురైలో 1959 ఆగస్ట్ 18న జన్మించిన నిర్మలా సీతారామన్ కీలకమైన మంత్రిత్వ శాఖలను అధిరోహించే స్థాయికి ఎదగడం ఆదర్శనీయం.
నిర్మలా సీతారామన్ తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో ఉన్న సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. ఆమె చదివిన ఆర్ధిక శాస్త్రం నేడు ఆమె ఆర్ధిక మంత్రిగా ఉపయోగించుకునే అవకాశం ప్రధాని నరేంద్ర మోడీ కలిపించారు.
1986లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పరకాల ప్రభాకర్ను (నర్సాపురం) పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ లండన్ వెళ్లారు. తర్వాత మళ్లీ ఇండియాకు తిరిగొచ్చారు. వీరికి ఒక కూతురు ఉంది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.
నిర్మలా సీతారామన్ ఇదివరకే ఆర్థికశాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. వాణిజ్య శాఖ మంత్రిగా కూడా కొనసాగారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యులుగా కూడా ఉన్నారు. ఈమె 2006 లో బీజేపీలో చేరారు. అప్పుడు నితిన్ గడ్కరీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. రక్షణమంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వహించిన నిర్మలా సీతారామన్, రాఫెల్ ఒప్పందంపై విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ధీటైన సమాధానం ఇస్తూ, ప్రధాని మోదీకి బలమైన సహకారాన్ని అందించారు.