తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 31వ రోజుకు చేరిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరాలని ప్రకటన చేయటంతో కొందరు ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరుతున్నారు. ఉప్పల్ డిపో అసిస్టెంట్ డిపో మేనేజర్ గా పని చేస్తున్న కేశవ కృష్ణ నిన్న ఉప్పల్ డిపో మేనేజర్ కు లేఖ అందించి తిరిగి విధుల్లో చేరారు. 
 
కామారెడ్డి డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న సయ్యద్ హైమద్ కూడా తిరిగి విధుల్లో చేరుతున్నానని రిపోర్టు చేశారు. కేసీఆర్ రాష్ట్రంలోని 10,400 రూట్లలో 5,100 ప్రైవేట్ రూట్లకు పర్మిట్లు ఇస్తామని స్పష్టం చేశారు. మెరుగైన రవాణా సదుపాయం మరియు ఆరోగ్యకరమైన పోటీతత్వం కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పల్లెవెలుగు బస్సు మార్గాలను మాత్రమే ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
నిన్నటినుండి సీఎం కేసీఆర్ ప్రైవేట్ బస్సులకు అనుమతి ఇవ్వటంతో బస్ పాసుల గురించి ప్రజల్లో గందరగోళం నెలకొంది. ప్రైవేట్ బస్సుల్లో బస్ పాసులు అనుమతించరు కదా...? అనే ప్రశ్న ప్రజల్లో మొదలైంది. ఈ విషయంపై ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చింది. ప్రభుత్వ నియంత్రణలోనే ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి. వికలాంగులు, విద్యార్థులు, జర్నలిస్టులు, టీఎన్జీవోలు ఇలాఎవరెవరికి ఏ బస్ పాసులు అమలులో ఉన్నాయో ఆ బస్ పాసుల రాయితీలు యధావిధిగా కొనసాగుతాయని సమాచారం. 
 
ప్రైవేట్ బస్సులలో కూడా బస్ పాసులకు సీఎం కేసీఆర్ అనుమతి ఇవ్వటం ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. కార్మికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని తెలంగాణలో కూడా చేయాలని కోరుతూ ఉండటంపై కేసీఆర్ స్పందించారు. ఏపీ సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇచ్చారని తెలంగాణ రాష్ట్రంలో అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని కేసీఆర్ అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: