52 రోజుల తరువాత ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి ఉద్యోగాల్లోకి వస్తామని అంటుంటే.. ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. అనడమే కాదు ఇప్పుడు ఏకంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు చకచకా పావులు కదుపుతున్నది. 5100 రూట్లలో బస్సులను ప్రైవేట్ పరం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. దీనిపై ఈరోజు ప్రగతి భవన్ ను కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉన్నది. దీని గురించి కూడా ఈరోజు మీటింగ్ లో చర్చించారు. అలానే డినోటిఫై చేసి ప్రైవేట్ రూట్లకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంతేకాదు, ఈ ప్రైవేట్ రూట్ల విషయంపై రేపు కూడా మరోమారు కేబినెట్ మీటింగ్ లో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అయోమయంలో పడింది.
వారి భవిష్యత్తు గురించి కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఇప్పుడు వారి కుటుంబాలు రోడ్డున పడ్డట్టేనా అన్నది డౌట్. 52 రోజులపాటు శ్రమకోర్చి సమ్మె చేశారు. డిమాండ్లు నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడ్డారు. కానీ, డిమాండ్లు నెరవేరకపోగా, సమ్మె చేసిన వాళ్ళను సెల్ఫ్ డిస్మిస్ చేసినట్టుగా మొదట్లోనే ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు దానికే కట్టుబడి ఉన్నట్టుగా కనిపిస్తోంది. డ్యూటీల్లో చేరేందుకు డిపోలకు వెళ్తే.. అక్కడ వాళ్ళను లోనికి అనుమతి ఇవ్వడం లేదు.
అటు ఆర్టీసీ తాత్కాలిక ఎండి కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా విధుల్లోకి తీసుకునే ప్రసక్తి లేదని తెగేసి చెప్తున్నారు. మరి ఈ సమయంలో 50వేల కుటుంబాలు రోడ్డున పడ్డట్టేనా.. ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బస్సులు నడుపుతుంటే.. నగరంలో రోజుకు రెండు మూడు చోట్ల యాక్సిడెంట్లు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాత్కాలిక డ్రైవర్లు ఎంతవరకు బస్సులను డ్రైవ్ చేస్తారో అందరికి తెలిసిందే.