నాకు ఆరు మాసాల గడువు ఇవ్వండి. మంచి సీఎం అని మీతో అనిపించుకుంటాను! - అని వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం జగన్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఇప్పుడు అక్షరం సత్యం అయిందా? ప్రజలు ఆయన పాలనకు జేజేలు పలుకుతున్నారా? అంటే.. ఔననే అంటోంది జాతీయ సర్వే! వాస్తవానికి పాలనలో రెండు రకాలు ఉంటుంది. ఒకటి ప్రజలు కోరుకున్న విధంగా, వారికి ఇబ్బందులు లేని విధంగా పనులు జరిగిపోవడం, రెండు పనులు ప్రజలను పీక్కుతినైనా పనులు చేయడం.
ఈ రెండింటిలో రెండో దాని వల్ల రాష్ట్రంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. కనీసం పింఛను కావాలన్నా.. చేతులు తడపాల్సిందే. ఇక, రైతులకు ఏమైనా కావాలన్నా.. గత ప్రభుత్వ హయాంలో అవినీతి విచ్చల విడిగా సాగిపోయింది. ప్రజా ప్రతినిధుల నుంచి అధికారుల వరకు అందరూ కూడా అవినీతి కూపంలో కూరుకుపోయిన ఫలితంగా గత ప్రభుత్వాన్ని గద్దె దించారనే చర్చ అనేక మార్లు జరిగింది. ఈ నేపథ్యంలో తాను అధికారంలోకి వస్తూనే.. జగన్ రాష్ట్రంలో అవినీతి అనే మాట లేకుండా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేస్తానని చెప్పారు.
అనుకున్నదే తడువుగా ఆయన అనే క రూపాల్లో అవినీతిని అంతమొందించే చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల అవినీతికి అడ్డుకట్ట వేస్తే.. ఆటోమేటిక్గా అవినీతి తగ్గిపోతుందని భావించిన ఆయన .. తన ఎమ్మెల్యేలను, మంత్రులను కట్టడి చేశారు. ఎలాంటి చిన్న ఆరోపణ వచ్చినా సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఫలితంగా గడిచిన ఆరు మాసాల్లో రాష్ట్రంలో అవినీతి 85 శాతం తగ్గిపోయింది. తాజాగా జాతీయ సర్వే ఒకటి అవినీతిపై వెల్లడించిన గణాంకాలు దీనినే స్పష్టం చేస్తున్నాయి.
2018 అక్టోబర్ నుంచి 2019 నవంబర్ మధ్య ఎంత మేరకు రాష్ట్రాల్లో కరప్షన్ జరిగిందనే దానిపై.. 20 రాష్ట్రాల్లోని 248 జిల్లాల్లో 1.9లక్షల మంది ప్రజలను అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే చేశారట. ఈ సర్వేలో ఏపీ 13 వ స్థానంలో నిలిచింది. అయితే గతేడాది జరిగిన ఈ తరహా సర్వేలోనే ఏపీ ఐదో స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు జగన్ సీఎంగా పదవి చేపట్టాక... అవినీతిలో ఏపీ ఐదో స్థానం నుంచి 13 వ స్థానానికి పడిపోయింది. అంటే... ఏపీలో జగన్ సీఎం అయ్యాక భారీ ఎత్తున అవినీతి తగ్గిందన్న మాట.