శుక్రవారం నాటి కేబినెట్ సమావేశంలో రాజధాని అమరావతిపై ఏదో ఒకటి తేలిపోతుందని, ఇక, రాజధాని విషయంలో జగన్ తనమనసులో ఉన్న విషయాన్ని చెప్పేస్తారని అందరూ అనుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, సామాజిక ఉద్యమ నాయకులు, రాజకీయ నేతలు కూడా పెద్ద ఎత్తున తాజా కేబినెట్ సమావేశంపై ఆశలు పెట్టుకున్నారు. కొందరు టీవీలకు అతుక్కుపోయారు. ఇక, రాజధాని జిల్లాలైన గుంటూ రు, కృష్నా జిల్లాల పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది.
జగన్ తీసుకునే నిర్ణయం తమ పాలిట శాపంగా మారుతుందా? వరంగా ఉంటుందా? అనే చర్చ ఈ రెండు జిల్లాల్లోనూ సాగింది. ఈ క్రమంలో జీఎన్ రావు కమిటీపై కూడా కేబినెట్ చర్చిస్తుందనే ఊహాగానాలు బయటకు వచ్చాయి. దీంతో మరింతగా కేబినెట్పై ఆశలు పెట్టుకున్నారు. విశాఖకు రాజధానిని తరలించే విషయాన్ని రాజధాని ప్రాంత ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అదేసమయంలో రాజదానిని, సీఎం నివాసం, రాజ్భవన్ వంటివి అమ రావతిలోనే కొనసాగాలని కూడా చెబుతున్నారు.
ఈ క్రమంలో వారు వారం పది రోజులుగా ధర్నాలు, నిరసన లతో ఆందోళనలు చేస్తున్నారు. వీటికి ఇక, శుక్రవారం నుంచి ఫుల్ స్టాప్ పెట్టడమా? లేక మరింతగా దూకు డు ప్రదర్శించడమా? అనే విషయంపై తేల్చుకోవాలని నిర్ణయించారు. అయితే, సీఎం జగన్ మాత్రం ప్రజల నాడికి అందకుండా వ్యవహరించారు. శుక్రవారం నాటి కేబినెట్ సమా వేశంలో రాజధాని విషయంపై చర్చించలేదు. కేవలం జీఎన్ రావు కమిటీ ప్రతులను మంత్రులకు పంపిణీ చేసి, వారి వారి అభిప్రాయాలను మాత్రమే కోరారు.
అదే సమయంలో మిగిలిన అమ్మ ఒడి వంటి కీలక సంక్షే మ కార్యక్రమాలపై మాత్రం చర్చించారు. ఇక, రాజధానిపై నియమించిన బోస్టస్ కన్సల్టెంగ్ గ్రూప్ కమిటీ నివేదిక వచ్చాక చర్చించాలని నిర్ణయించారు. అయితే, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ప్రజలు ఆగ్రహంతో ఉండడం, ఉద్యమాలకు మరింతగా సిద్ధం కావడం నేపథ్యంలో జగన్ వ్యూహాత్మకంగా రాజధాని విషయాన్ని ప్రస్తావించలేదని అంటున్నారు. మొత్తానికి రాజధాని అంశంపై ఉత్కంఠను జగన్ మరింత పీక్కు తీసుకువెళ్లడం గమనార్హం.