చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాకు అతి త్వరలో మంత్రి పదవి రానుందని తెలుస్తోంది. వైసీపీ పార్టీ వర్గాల్లో ప్రస్తుతం రోజా మంత్రి పదవి గురించే భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. శాసన మండలి రద్దు రోజాకు ఎంతో మేలు ఛేయనుంది. వైసీపీ ప్రభుత్వం శాసన మండలి రద్దు తీర్మానాన్ని తెరపైకి తీసుకొనిరావడంతో కేబినెట్ మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామాల గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. 
 
తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ పార్టీ పెద్దలు కూడా వీరిద్దరితో రాజీనామా చేయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. నైతికంగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ మంత్రులుగా కొనసాగటం సరికాదని అందువలన వీరితో రాజీనామా చేయించడమే మంచిదని వైసీపీ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
త్వరలో వీరిద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేస్తే మాత్రం రెండు మంత్రి పదవులు ఖాళీ కానున్నాయి. తొలి కేబినేట్ లోనే కొంత మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాల్సి ఉన్నప్పటికీ సామాజిక సమీకరణల వలన వీరికి మంత్రి పదవి దక్కలేదు. అలా మంత్రి పదవి దక్కనివారిలో రోజా కూడా ఒకరు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా రోజాకు తొలి కేబినేట్ లో మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ సీఎం జగన్ రెండున్నరేళ్ల తరువాత ఏర్పడే కేబినేట్ లో రోజాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. రోజాకు మంత్రి పదవి ఇవ్వడం వీలు కాకపోవడంతో రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. ఇప్పుడు రెండు మంత్రి పదవులు ఖాళీ కానుండడంతో రోజాకు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి నిజంగా రోజాకు మంత్రి పదవి దక్కుతుందో లేదో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: