ప్రధాని మోడీ 69 వ పుట్టినరోజును ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రధానికి ఇది ఆయనకు ఐదో పుట్టినరోజు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టినరోజు వేడుకలు గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అయ్యేవి. ప్రధాని అయ్యాక అయన వేడుకలను బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది లానే ఈసారి కూడా మోడీ తన సొంత రాష్ట్రంలోనే ఈ వేడుకలు జరుపుకోవడానికి వెళ్లారు.
గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉంటున్న ప్రధాని తల్లి హీరాబెన్ ను ఈ ఉదయం కలుసుకున్నారు. తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. హీరాబెన్ తన చిన్న కొడుకు పంకజ్ మోడీతో కలిసి రైసిన్ అనే గ్రామంలో ఉంటున్నది. ప్రధాని ప్రతి ఏడాది అక్కడికి వెళ్లి తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు. 98 సంవత్సరాల వయసులో కూడా హీరాబెన్ తన పనులు తాను చక్కగా చూసుకుంటుంది. సంతోషంగా గడుపుతున్నది.
తల్లి ఆశీర్వాదం తీసుకున్నాక మోడీ అక్కడి నుంచి నర్మదా జిల్లాలోని కెవడియా చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. నర్మదా నది పూజను నిర్వహిస్తారు. అక్కడై నుంచి సర్దార్ వల్లభాయ్ సరోవర్ డ్యామ్ కంట్రోల్ రూమ్ ను సందర్శిస్తారు. అనంతరం మోడీ అక్కడి నుంచి గరుడేశ్వర్ వెళ్లి అక్కడ దత్తాత్రేయ స్వామి వారిని దర్శిస్తారు. అనంతరం కెవడియా చేరుకొని అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారు.
క్లుప్తంగా మోడీ ఈరోజంతా గుజరాత్ రాష్ట్రంలోనే గడపబోతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో పలు అభివృద్ధి పర్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక దేశంలోని బీజేపీ కార్యాలయాల్లో మోడీ పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న పుట్టినరోజు వేడుకలు కావడం.. త్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు వంటివి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంతో.. ఈ వేడుకల్లో ముస్లిం మహిళలు, జమ్మూ కాశ్మీర్ వాసులు పాల్గొనే అవకాశం ఉన్నది.