ఉత్తరాది రాష్ర్టాలైన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలో ఇసుక తుఫాను మరోసారి హడలెత్తించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈదురుగాలులు, ఇసుక తుఫాన్ విధ్వంసం సృష్టిస్తున్నాయి. జస్థాన్లో కూడా ఇసుక తుఫాను ప్రభావం కొనసాగుతున్నది. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, తుఫానులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.
తాజాగా బీజేపీ ఎంపీ హేమమాలిని తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ మధురలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఆమె కాన్వాయ్ ముందు పెద్ద చెట్టు కూలింది. చెట్టు కూలుతున్న విషయాన్ని గమనించిన డ్రైవర్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, మాంట్ తహశీల్లోని మిట్టౌలీ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న హేమమాలిని ప్రసంగిస్తుండగా వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకున్నాయి.
దీంతో వెనక్కి వెళ్లిపోవాలని ఎంపీ నిర్ణయించుకున్నారు. వెంటనే తిరుగు ప్రయాణం కొనసాగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కాకపోతే ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదేని..అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా 29 మంది మృతి చెందారు.