కిందపడ్డా పైచేయి నాదే! అనే బాపతు రాజకీయ నాయకుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ముందుంటారు. ప్రతి కూలత ను కూడా తనకు, తన పార్టీకి అనుకూలంగా మార్చుకునే నాయకుల్లో బాబును మించిన నాయకుడు మరొకరు లేరు. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ల పాలనను ప్రత్యేకంగా గమనిస్తే.. ఇదే కనిపిస్తుంది. అనేక వైఫల్యాలు చంద్రబాబును, ఆయన పార్టీని చుట్టుముట్టిన సందర్భంలోనూ వాటిని అధిగమించేందుకు బాబు చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. ఎదుటి పార్టీపై దుమ్మెత్తిపోసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రత్యేక హోదా, అమరావతి నిర్మాణం, కేంద్రంతో పొత్తు-తర్వాత విడాకులు వంటివిషయాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారు.
ఇక, ఇప్పుడు ఎన్నికల వేడి చరమాంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో నరాలు తెగే ఉత్కంఠకు ఏపీలో తెరపడ నుంది. అయితే, ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? అనే విషయాలపై మాత్రం తీవ్రస్థాయిలో తర్జన భర్జనలు జరుగు తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఎగ్జిట్ పోల్ సర్వేలో కొన్ని చంద్రబాబుకు అనుకూలంగా రాగా, మరికొన్ని మాత్రం వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కుండబద్దలు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఎవరు అధికారంలోకి వస్తున్నారు? అనేది మిలి యన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే, తాను గెలిస్తే.. చెప్పుకొనేందుకు అభివృద్ది-సంక్షేమం అనే ఎజెండాను చంద్రబాబు ఆయన టీం ముందుగానే సిద్ధం చేసుకున్నారు.
ఒక వేళ.. కొన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిజమై.. వైసీపీ అధికారంలోకి వస్తే.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి ? అనేది తెరమీది కి వస్తున్న తాజా ప్రశ్న. దీనికి కూడా ఆయన గ్రౌండ్ లెవిల్లో ఓ ప్రధాన అజెండాను రెడీ చేసుకున్నారని అంటున్నారు పేరు వెల్లడించడానికి ఇష్టపడని సీనియర్ నాయకుడు. తాము గెలిస్తే.. మహిళలు, సంక్షేమం, అభివృద్ది తమకు పట్టం కట్టాయని చెప్పుకొంటామని, అదే వైసీపీ గెలిస్తే.. ఇది జగన్ బలం కాదు.. ఉత్తరాది నుంచి కొనితెచ్చుకున్న పీకే ప్రయోగమేనని చెప్పుకొనేందుకు తాము స్క్రిప్టు సిద్ధం చేసుకున్నామని అంటున్నారు. జగన్కు సొంత బలం, వ్యూహం ఏమీ లేదని, కొనితెచ్చుకున్న బలంతోనే విర్రవీగుతున్నాడని, ఇది ఎంతో కాలం నిలవబోదని, తనకంటూ సొంతగా వ్యూహం లేని జగన్.. రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడో చూస్తామని కూడా చంద్రబాబు అనే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి కిందపడ్డా పైచేయి టైపులో చంద్రబాబు వ్యూహాన్ని సిద్ధం చేసుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది.