చెల్లెలు షెడ్యూల్డ్ ట్రైబ్ కానప్పుడు ఆమె అక్క షెడ్యూల్డ్ ట్రైబ్ ఎలా అవుతుంది? అంటూ సరికొత్త అభ్యంతరాలు ఆరంభించారు విజయనగరం బిజెపి నేతలు.ఈ మేరకు ఎస్టీ -రిజర్వుడు స్థానమైన విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన పాముల పుష్పశ్రీవాణి కుల విషయమై విచారణ చేయాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో పోటీకి నిలబడే అభ్యర్థులు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి అనే నిబంధన ఉన్నా పుష్పశ్రీవాణి 2013 లో తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రాన్ని నామినేషన్ సమయంలో సమర్పించారని, ఎన్నికల రిటర్నింగ్ అధికారి దానిని ఎలా ఆమోదించారని ప్రశ్నించారు.
బినామీ గిరిజనుల మూలంగా అసలైన గిరిజనులకు అన్యాయం జరుగుతుందని గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో పోటీకి నిలబడే అభ్యర్థులు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలనే నిబంధన ఉన్నా పుష్పశ్రీవాణి దానిని అనుసరించలేదని ఆయన ఆమె నామినేషన్ ను ప్రశ్నించారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి దానిని ఏ విధంగా ఆమోదించారని ప్రశ్నించారు. ఈ విషయమై పోరాడుతున్న స్థానిక గిరిజన సంఘం నేతలకు బీజేపీ గిరిజన మోర్చా మద్దతు ఉంటుందన్నారు. పుష్ప శ్రీవాణి సోదరి పాముల రామతులసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన అనంతరం ఆమె ఎస్టి కాదని అప్పటిలో పార్వతిపురం “ఐటీడీఏ – పీవో” విచారణ చేసి నిర్ధారించారన్నారు. ఇదే విషయమై ఇప్పుడు అభ్యంతరంవస్తే అధికారులు ఎందుకు వెనకాడుతున్నారో? అర్థం కావటం లేదన్నారు. దీనిపై న్యాయ పోరాటానికి బిజెపి సిద్దమవుతున్నట్టు ఆయన చెప్పారు.