మంచి చేస్తారని భావించి ప్రజలు వైకాపాకు ఓట్లేసి గెలిపించారు తప్ప.. రౌడీయిజానికి కాదని మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అనంతపురం, ప్రకాశం, గుంటూరు.. ఇలా నిత్యం ఏదో ఒక జిల్లాలో తెదేపా కార్యకర్తలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్నికల్లో తెదేపాకు సహకరించారన్న కారణంతో సంఘమిత్రలను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.

 

ప్రభుత్వం దాడులను మానుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం గుడుపల్లి, కుప్పం మండలాల్లో చంద్రబాబు పర్యటించారు. రోడ్డుషోలతో పాటు.. కార్యకర్తల అంతర్గత సమావేశాల్లో ప్రసంగించారు. ‘నా నియోజకవర్గ పర్యటనకు వస్తుంటే పార్టీ జెండాలను కట్టకుండా అడ్డుకున్నారు.

 

ఇలా చేస్తుంటే బాధ వేయదా? మాజీ ముఖ్యమంత్రే భయపడితే ఇక సామాన్యులకు రక్షణ ఉంటుందా? ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మేం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంపై వివక్ష చూపించామా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘నన్ను ఏం చేసినా ఫర్వాలేదు. నన్ను నమ్ముకున్నవారు, కార్యకర్తల జోలికి వస్తే మాత్రం పోరాటం చేస్తా. అని హెచ్చరించారు.

 

కుప్పంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం ఉదయం చంద్రబాబు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయన వద్దకు వచ్చి భావోద్వేగానికి లోనయ్యారు. ‘మీరు మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తారని అనుకున్నాం. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు మహిళలు విలపించారు. వారికి చంద్రబాబు ధైర్యం చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: