ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025 నాటికి 5 లక్షల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ వడివడిగా అడుగులేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో ఆదాయపన్ను వార్షిక పరిమితిని రూ.5 లక్షలుగా పేర్కొన్నారు. మధ్యతరగతికి ఊరటగా.. రూ.45 లక్షల్లోపు గృహ రుణాలపై వడ్డీ రాయితీని రూ.3.5 లక్షలకు పెంచారు. బంగారం, పెట్రోల్, డీజిల్‌లపై కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్టు ప్రకటించి షాకిచ్చారు.

 

ఇప్పటి వరకు బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం ఆర్థిక మంత్రులు సూట్‌కేసులో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చేవారు.. కానీ నిర్మలా సీతారామన్ ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. నాలుగు మడతల ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ పత్రాలను తీసుకొని ఆమె పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ వస్త్రంపై ఎర్రటి రాజముద్ర కనిపించింది.

 

నిర్మలా సీతారామన్ ప్రసంగం ముఖ్యాంశాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

 

  • 2014-19 మధ్య ఆహర భద్రత కోసం రెట్టింపు ఖర్చు చేశాం. నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

 

  •  ఎన్డీయే అధికారంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఈ ఏడాదే 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుంది. 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరనుంది.

 

  •  300 కి.మీ. మేర మెట్రో రైలు నెట్‌వర్క్‌కు 2018-19లో అనుమతిచ్చాం. దేశవ్యాప్తంగా మెట్రో పరిధి 657 కి.మీ.కు పెరిగింది.

 

  •  రోడ్లు, రైలు మార్గాలపై ఒత్తిడి తగ్గించడానికి జల మార్గ్ వికాస్‌కు ప్రాధాన్యం.

 

  •  నూతన అద్దె చట్టం.. మోడల్ టెనెన్సీ లాను తీసుకురానున్నాం.

 

  •  దేశవ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ ఏర్పాటు.

 

  •  వన్ నేషన్, వన్ గ్రిడ్ విధానం ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా. ఈ ఏడాదిలోనే వాటర్ గ్రిడ్, గ్యాస్ గ్రిడ్‌ల ఏర్పాటు.

 

  •  రైల్వేల్లో మౌలిక వసతుల కల్పనకు 2018-30 మధ్య రూ.50 లక్షల కోట్లు అవసరం. పీపీపీ విధానంలో సౌకర్యాలను మెరుగుపరుస్తాం.

 

  •  భారత్ అంతరిక్ష శక్తిగా ఎదుగుతోంది. ఇస్రో సేవలను వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడానికి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) సంస్థను ఏర్పాటు చేస్తాం.

 

  • ఏవియేషన్, మీడియా, యానిమేషన్, బీమా రంగాల్లో ఎఫ్‌డీఐలపై చర్చ జరుపుతాం.

 

  •  ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో భాగంగానే ప్రస్తుతం 114 రోజుల్లోనే ఇళ్లను నిర్మిస్తున్నాం. 2022 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తాం. గ్రామ సడక్ యోజన కింద గ్రీన్ టెక్నాలజీ 30 వేల కి.మీ. రోడ్లను వేశాం. వచ్చే ఐదేళ్లలో రూ.80,250 కోట్ల ఖర్చుతో 1.25 లక్షల కి.మీ. పొడవైన రోడ్లను వేస్తాం.

 

  •  స్టాక్ మార్కెట్లో పెట్టుబడుటు పెట్టే ఎన్నారైలకు వెసులుబాటు. చిల్లర వ్యాపారులకు ప్రధాని కర్మయోగి పథకం ద్వారా నూతన ఫించన్ పథకం.

 

  •  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ లివింగ్ అనేవి రైతులకు కూడా వర్తించాలి. జీరో బడ్జెట్ ఫార్మింగ్‌ను తీసుకొస్తాం. కొన్ని రాష్ట్రాల్లో రైతులు ఇప్పటికే ఈ దిశగా శిక్షణ పొందారు.

 

  •  జల జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటికి 2024 నాటికి తాగు నీరు అందిస్తాం.

 

  • దేశంలో 6 లక్షలకుపైగా గ్రామాలు బహిరంగ మలవిసర్జన అలవాటును మానుకున్నాయి.

 

  •  దేశ పురోగతిలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళలది కీలక పాత్ర. గత ఎన్నికల్లో మహిళలు రికార్డు స్థాయిలో ఓటేశారు. లోక్ సభలో 78 మంది మహిళా ఎంపీలున్నారు. మహిళలు కేంద్రంగా పాలసీలను తీసుకొస్తాం.

 

  •  మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం కోసం స్వయం సహాయక బృందాల సభ్యులకు లక్ష రూపాయల ముద్రా రుణం ఇస్తాం. జన్‌ధన్ ఖాతాలు ఉన్న మహిళలకు రూ.5 వేల ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తాం.

 

  •  భారత పాస్‌పోర్టులున్న ఎన్నారైలకు ఆధార్ కార్డులు.. దేశానికి తిరిగొచ్చాక 180 రోజులు వేచి ఉండాలనే నిబంధన తొలగింపు.

 

  • ప్రధాన్ మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్ ద్వారా 2 కోట్ల మంది డిజిటల్ అక్షరాస్యులయ్యారు. దీన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాం.

 

  •  పట్టణీకరణలో అవరోధాలకంటే ప్రయోజనాలనే ఎక్కువగా చూశాం. ప్రధాని మంత్రి ఆవాస్ యోజన ద్వారా పట్టణ ప్రాంతాల్లో 81 లక్షల ఇళ్లను మంజూరు చేశాం. వీటిలో 26 లక్షల ఇళ్లను నిర్మించాం. 95 శాతం నగరాలు (బహిరంగ మలవిసర్జన రహితం) ఓడీఎఫ్‌గా ఉన్నాయి.

 

  •  యువత, సమాజానికి గాంధీ విలువలను తెలియజేసే ఉద్దేశంతో గాంధీ పీడియాను డెవలప్ చేస్తున్నాం.

 

  •  ఉన్నత విద్యలో సంస్కరణల కోసం విద్యావిధానంలో మార్పులు తీసుకొస్తాం. పరిశోధనలను పెంచడానికి ప్రాధాన్యం ఇస్తాం.

 

  •  ఐదేళ్ల క్రితం ప్రపంచంలోని టాప్-200 యూనివర్సిటీల్లో భారత్ నుంచి ఒక్కటి కూడా లేదు. కానీ సర్కారు ఫోకస్ చేయడంతో 2 ఐఐటీలు, ఐఐఎస్సీ బెంగళూరు ఈ జాబితాలో చేరాయి. ప్రపంచ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు 2019-20లో రూ.400 కోట్లను కేటాయిస్తున్నాం.

 

  •  విదేశీ విద్యార్థులు మనదేశంలో ఉన్నత విద్యను అభ్యసించేలా కృషి చేస్తున్నాం.

 

  •  ఖేలో ఇండియా పథకాన్ని విస్తరిస్తాం. క్రీడల అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయిస్తాం.

 

  •  కోటి మంది యువతకు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా శిక్షణ ఇస్తాం. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, రోబోటిక్స్‌లో శిక్షణ ఇస్తాం.

 

  •  స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా టెలివిజన్ చానెల్‌ను ప్రారంభిస్తాం.

 

  •  భారత్ నెట్ ద్వారా ప్రతి పంచాయతీకి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తాం.

 

  •  ఉజ్వల యోజన ద్వారా 35 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేశాం. వీటి ద్వారా ఏటా రూ.18,341 కోట్లు ఆదా అయ్యాయి.

 

  •  ఆఫ్రికా దేశాల్లో 18 రాయబార కార్యాలయాలు తెరవడానికి అంగీకారం.

 

  •  17 ఐకానిక్ టూరిజం కేంద్రాల ఏర్పాటు. వీటి ద్వారా దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది.

 

  •  దివాళా చట్టం ద్వారా రూ.4 లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేశాం. ప్రస్తుతం లక్ష కోట్ల రూపాయల మొండి బకాయిలు ఉన్నాయి. 6 ప్రభుత్వ బ్యాంకులను సంక్షోభం నుంచి బయటపడేశాం.

 

  •  వచ్చే ఐదేళ్లలో మౌలిక వసతుల కల్పనకు లక్ష కోట్ల రూపాయలు.

 

  •  పీఎస్‌యూల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కింద ఈ ఏడాది రూ. 1.05 లక్షల కోట్లు ఆర్జించాలని లక్ష్యం. ప్రభుత్వ వాటా 51 శాతం తగ్గకుండా పెట్టుబడుల ఉపసంహరణ.

 

  •  భారత విదేశీ రుణాలు జీడీపీలో 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ప్రపంచంలోనే ఇది అత్యల్పం.

 

  •  త్వరలోనే కొత్త నాణేలు రాబోతున్నాయి. రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలు వచ్చేస్తున్నాయి. అంధులు కూడా గుర్తించేలా ఇవి ఉండనున్నాయి.

 

  •  నిజాయితీగా పన్నులు కట్టేవారికి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు.

 

  •  రూ.5 లక్షల వార్షిక ఆదాయం దాటితేనే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. రూ.250 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలకు కనిష్టంగా 25 శాతం కార్పోరేట్ ట్యాక్స్ కడుతున్నాయి. దీన్ని రూ.400 కోట్ల టర్నోవర్‌కు పెంచాం. 0.7 శాతం కంపెనీలు మాత్రమే ఈ పరిధిలోకి రావు.

 

  •  ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తాం. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు రుణాల వడ్డీపై రూ.1.5 లక్షల వరకు రాయితీ. ఈ రుణాలు పొందిన వారికి ఆదాయపన్ను తగ్గింపు.

 

  •  రూ.45 లక్షలలోపు గృహ రుణాలపై రూ.3.5 లక్షల వడ్డీ రాయితీ. ఇప్పటి వరకూ రాయితీ రూ.2 లక్షలు మాత్రమే.

 

  •  స్టార్టప్‌లకు పెట్టుబడుల సమీకరణపై ఆదాయపన్ను పరిశీలన ఉండదు.

 

  •  పన్ను చెల్లింపుదారులకు సులభతరం చేసేలా.. ఆధార్, పాన్ స్వాప్. పాన్ లేకపోయినా ఆధార్‌తో ఐటీ రిటర్న్ సమర్పించే వీలు. ఆధార్, పాన్ లింక్ చేయని వారు ఆధార్ నంబర్ పేర్కొంటే చాలు.

 

  •  బ్యాంక్ ఖాతాల నుంచి ఏడాదికి కోటి రూపాయల కంటే ఎక్కువగా విత్ డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్. రూ.3.5 కోట్ల వరకు డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి పన్నుల్లేవు.

 

  •  జీఎస్టీని సరళీకృతం చేస్తున్నాం. ఏడాదికి రూ.92 వేల కోట్ల మేర ఉపశమనం కల్పించాం.

 

  •  ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్ ద్వారా జీఎస్టీ ఫిర్యాదులు తగ్గుతాయి.

 

  •  క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. కాబట్టి.. లీటర్ పెట్రోల్, డీజీల్‌లపై కస్టమ్ డ్యూటీని రూ.1 చొప్పున పెంచుతున్నాం. బంగారంపై కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంపు.

 

  •  సీసీ కెమెరాలు, మార్బుల్స్, వాహన విడి భాగాలపై పన్నులు పెంపు. మేకిన్ ఇండియా ప్రోత్సాహానికి దిగుమతులపై పన్నుల పెంపు.

మరింత సమాచారం తెలుసుకోండి: